ధర్మపురి, జనవరి 22: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామివారి సన్నిధిలో శనివారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనర్సింహ స్వామివారి దేవాలయం తోపాటు అనుబంధ ఆలయాల్లో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ఆశీర్వదించారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, పండితుడు బొజ్జ రమేశ్శర్మ, అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్య, నంబి శ్రీనివాసాచార్య తదితరులున్నారు.
గూడెంలో దీక్ష విరమణకు ఎమ్మెల్యే
మెట్పల్లి, జనవరి 22: స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అయ్యప్పస్వామి దీక్ష విరమణకు గానూ శనివారం ఉదయం గూడెం దేవస్థానానికి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు పట్టణంలోని పంచముఖ ఆంజనేయ, అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తం చేతుల మీదుగా ఎమ్మెల్యే ఇరుముడి కట్టుకొని గూడెం ఆలయానికి బయల్దేరి వెళ్లారు.