ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ గల్లంతే
అబద్ధాలు.. అసత్య ప్రచారమే నమ్ముకున్నరు
కలుపు మొక్కలను తుంచేయాలి
కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రగతి
గెల్లును గెలిపించండి.. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
హుజూరాబాద్/ఇల్లందకుంట, అక్టోబర్ 21: “ కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే. చేసేదంతా అసత్య ప్రచారమే. ప్రజలేమన్నా అమాయకులా..? వారికి అన్నీ తెలుసు. ప్రతిపక్షాల పని అయిపోయింది. ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్ వైపు ఉంటారా..? ప్రగతి నిరోధకుల వైపు ఉంటారో.. ఆలోచించుకోండి..? అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుతగులుతున్న కలుపు మొక్కలను తుంచివేయండి. పని చేసే ప్రభుత్వాన్ని అండగా ఉండి… గెల్లును గెలిపించండి” అని . ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అలాగే ఇల్లందకుంట మండలం సిరిసేడులో అపర్ణ సుమేశ్వర ఆలయం, ఇల్లందకుంటలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందకుంట టీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆయాచోట్ల మాట్లాడారు. ఉద్యమ సాధనలో అలుపెరగని పోరాటం చేసిన గెల్లు శ్రీనివాస్యాదవ్కు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో నీళ్లు లేక భూములు బీడుగా ఉండేవనీ, ఇప్పుడు కాళేశ్వరం జలాలతో పుష్కలమైన పంటలతో కళకళలాడుతున్నాయని చెప్పారు. ఇది గమనించాలని, కండ్లుండీ చూడలేని కబోదుల్లా మాట్లాడితే ఎలా అని కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కృషితోనే ఇదీ సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవ జరిగేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, అయితే అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్న కలుపు మొక్కలను ఆదిలోనే తుంచివేయాలని సూచించారు. ఇక్కడ నాయకులు గొర్రె వెంకట్రెడ్డి, రుద్ర రాధ, కంజర్ల రేణుక, సరస్వతి, సువర్ణ తదితరులున్నారు.
మాది రైతు ప్రభుత్వం: ఎమ్మెల్సీ పల్లా
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, కర్షకులకు అన్నిరంగాల్లో అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇల్లందకుంటలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నదని, ప్రాజెక్టుల ద్వారా నిరంతరం సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్ కోసం మూడు నెలలుగా కష్టపడి పని చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరో పది రోజులు ముందుండి పని చేయాలని కోరారు. రైతులకు రైతు వేదికలు, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశారని చెప్పారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, వేలేరు జడ్పీటీసీ చాడ సరిత, లింగాలఘణపూర్ ఎంపీపీ జయశ్రీదేవి, మహిళా మండలాధ్యక్షురాలు స్వరూపరాణి, వరంగల్ ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్ గుండేటి రాజేశ్వర్రెడ్డి, ఇల్లందకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, ఐలయ్య, ఇల్లందకుంట ఇన్చార్జి దేవేందర్, నాయకులు సరిగొమ్ముల వెంకటేశ్, రాంస్వరణ్రెడ్డి, రాజిరెడ్డి, కుమార్, పెద్ది కుమార్, విక్రమ్, ప్రశాంత్, రాకేష్, దేవేందర్, వేణు ఉన్నారు.