సర్కారు దవాఖానల్లో వసతుల మెరుగుకు విరివిగా నిధులు
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురిలో ఎంసీహెచ్ నిర్మాణానికి స్థల పరిశీలన
ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని చెప్పారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కోసం విరివిగా నిధులు వెచ్చిస్తున్నదని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రూ. 8.90 కోట్ల వ్యయంతో 50 పడకలతో కూడిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని రెండుచోట్ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్కారు చేపట్టిన పకడ్బందీ చర్యలతోనే రాష్ట్రంలో ప్రసవ మరణాలు సున్నా శాతానికి చేరాయని చెప్పారు. సాధారణ ప్రసవాలు పెంచే లక్ష్యంతోనే కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి వెంట ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ ఉన్నారు.
బాధిత కుటుంబానికి మంత్రి భరోసా
ధర్మారం, జనవరి 21: మండల కేంద్రానికి చెందిన కట్ట రాజు విద్యుత్ షాక్తో మృతిచెందగా, అతడి కుటుంబానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా కల్పించారు. బాధిత కుటుంబం వినతి మేరకు స్పందించిన అమాత్యుడు పరిహారం గురించి సంబంధిత శాఖకు సిఫారసు చేయడంతో రూ. 5 లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. ఈ మేరకు చెక్కును శుక్రవారం కరీంనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మృతుడు రాజు భార్య పద్మకు అందజేశారు. ప్రభుత్వం నుంచి సాయం ఇప్పించిన మంత్రికి మృతుడి భార్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల లత, టీఆర్ఎస్ అనుబంధ అసంఘటిత కార్మిక విభాగం, యూత్ మండలాధ్యక్షులు రేగుల జితేందర్, మంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.