జిల్లా విద్యాధికారి సీహెచ్ జనార్దన్రావు
చింతకుంటలో సర్వే పరిశీలన
కొత్తపల్లి, జనవరి 21 : మండలంలోని చింతకుంటలో సీఆర్పీలు నిర్వహిస్తున్న బడి బయట పిల్లల సర్వేను జిల్లా విద్యాశాఖాధికారి సీహెచ్ జనార్దన్రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 11 నుంచి 25 వరకు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఆర్పీలు వారి పరిధిలోని హ్యాబిటేషన్లలో ఇంటింటికీ వెళ్లి 6 నుంచి 14 సంవత్సరాలు, 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న బడిబయట పిల్లలను గుర్తించాలని సూచించారు. అంతేకాకుండా ఐఈఆర్పీల సాయంతో దివ్యాంగ పిల్లల వివరాలు సేకరించాలన్నారు. సర్వేను స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల విద్యాధికారులు, సెక్టోరల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. శుక్రవారం ఆసీఫ్నగర్లో బడి బయట పిల్లలు ఆరుగురు, చింతకుంటలోని శాంతినగర్ ఇటుక బట్టీల వద్ద 16 మంది, కమాన్పూర్ ఇటుక బట్టీల వద్ద 17 మందిని, బద్దిపల్లి ఇటుకబట్టీల వద్ద 18 మంది, చింతకుంట పరిసర ప్రాంతాల్లోని ఇటుకబట్టీల వద్ద 60 మంది బడిబయట పిల్లలను గుర్తించినట్లు ఆయన చెప్పారు. వీరిని సమీపంలోని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో మధుసూదనాచారి, సీఆర్పీలు పరశురాములు, ఐఈఆర్సీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.