జమ్మికుంట, జనవరి 21: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా కరోనా వ్యాప్తి నియంత్రణకు ఇంటింటా జ్వర సర్వే చేయిస్తున్నదని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, మెప్మా, ఆశ వర్కర్లతో జ్వర సర్వేపై సన్నాహక సమావేశాన్ని వావిలాల పీహెచ్సీ మెడికల్ అధికారి డాక్టర్ తులసీదాస్, మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. సర్వే పూర్తిస్థాయిలో చేయాలని పిలుపునిచ్చారు. కరోనా బారినపడిన ప్రజలకు ధైర్యానివ్వాలని, జ్వర పీడితులకు ప్రభుత్వం పంపించిన కిట్లను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జ్వర సర్వేకు వెళ్తున్న సిబ్బందికి ఐసొలేషన్ కిట్లు అందజేశారు. ఇక్కడ వైద్య, ఆరోగ్య సిబ్బంది, మెప్మా ఆర్పీలు, సభ్యులున్నారు.
మెప్మా ఆర్పీలకు శానిటరీ కిట్ల పంపిణీ
హుజూరాబాద్టౌన్, జనవరి 21: హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల 23 మంది మెప్మా ఆర్పీలకు శానిటరీ కిట్లను శుక్రవారం అందజేశారు. మెప్మా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని అందజేశామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెప్మా సీఎల్ఆర్పీలు రమాదేవి, స్వరూప, పీడబ్ల్యూడీ వలంటీర్ అనూష, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ సిబ్బందికి ..
హుజూరాబాద్ రూరల్, జనవరి 21: మండలంలోని రంగాపూర్ పంచాయతీ సిబ్బందికి జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు శానిటైజర్ కిట్లను అందజేశారు. ఇక్కడ సర్పంచ్ బింగి కరుణాకర్ తదితరులున్నారు.