మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
వాలీబాల్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లలితానగర్లోని మినీస్టేడియంలో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు కోసం సోమవారం ఆమె భూమి పూజ చేసి, మాట్లాడారు. స్థానిక 23వ వార్డు పరిధిలోని మినీ స్టేడియం ఆవరణలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రత్యేక చొరవతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు 32లక్షలు మంజూరు చేశారన్నారు. గ్రామీణ స్థాయిలో ఎంతోమంది ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక వెనకబడిపోతున్నారన్నారు. అకాడమీ ఏర్పాటుతో ఇక్కడే అన్ని రకాల శిక్షణతో పాటు వసతి, మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సం బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మినీ స్టేడియం లో రన్నింగ్ ట్రాక్, టెన్నిస్బాల్, బాస్కెట్బాల్,ఆర్చరీ, లాంగ్జంప్, హైజంప్, చెస్, క్యారం క్రీడలకు సంబంధించిన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు రాపెల్లి అరుణ, కల్లూరి రాజు, కొమిరె సంజీవ్గౌడ్, గుడ్ల రవి పాల్గొన్నారు.
రూ.6.30కోట్లతో ఉదర వాగు కాలువ పనులు
జిల్లా కేంద్రంలోని ఉదర వాగు కాలువ పనులను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్థానిక పెద్దబోనాల, బీవైనగర్, వెంకంపేట, పద్మనగర్ మీదుగా కొత్త చెరువు వరకు గల ఉదర వాగు కాలువ శిథిలావస్థకు చేరుకోవడంతో మంత్రి కేటీఆర్ చొరవతో నూతన కాలువ నిర్మాణానికి రూ.6.30కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇక్కడ కమిషనర్ వెల్దండి సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు కల్లూరి రాజు, రాపెల్లి అరుణ, గూడూరి భాస్కర్, నాయకులు రాపెల్లి లక్ష్మీనారాయణ, సామల శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.