రాజన్న సిరిసిల్లలో ఒమిక్రాన్ కేసు
ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన బాధితుడు
నిర్ధారించిన వైద్యాధికారులు
అప్రమత్తమైన యంత్రాంగం
హైదరాబాద్కు తరలింపు
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 30, నమస్తే తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ముస్తాబాద్ మండలం గూడెంలో కేసు నమోదు కావడంతో అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. గూడెం గ్రామానికి చెందిన బాధితుడు దుబాయ్ నుంచి ఈ నెల 16న స్వదేశానికి రాగా, అతడికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు హైదరాబాద్కు తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తికి నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ వచ్చింది. విమానాశ్రయంలో అక్కడి సిబ్బంది నమూనా తీసుకుని పరీక్షకు పంపించడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే అధికారులు అప్రమత్తమై బాధితుడిని చికిత్స కోసం హైదరాబాద్లోని టిమ్స్ దవాఖానకు తరలించారు. ఆవెంటనే పోలీసులు, వైద్యాధికారులు గ్రామానికి చేరుకుని, బాధితుడి ఇల్లంతా శానిటైజ్ చేశారు. ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లి ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాధితుడికి ఒమిక్రాన్ ఉన్నట్లు పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సంజీవరెడ్డి నిర్ధారించారు.
బంధువులను ఆరా తీస్తున్న అధికారులు
దుబాయి నుంచి వచ్చిన బాధితుడి బంధువుల వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా కంటే ఒమిక్రాన్ ఉధృతంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నందున అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాధితుడు వచ్చి నాలు గు రోజులుగా ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడన్న వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ప్రజలను మాస్కులు లేకుండా బయటకు రావద్దం టూ హెచ్చరించారు. బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఇదిలా ఉండగా దుబాయ్లో అతను ఉండే ఏరియాలో ఉన్న వారికి కూడా ఫోన్ చేసి అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో 90 శాతం పైగా వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అది ఇంతలోనే నిరోధించేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏరియా దవాఖానలో 170 పడకలు సిద్ధం
కరోనా రెండో వేవ్ద్వారా వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్న మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు జిల్లా ఏరియా దవాఖానలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు. ఐసీయూ వార్డులో ఉండే అధునాతన సౌకర్యాలతో 170 పడకలు సిద్ధంగా ఉంచారు. తగినంత సిబ్బంది, మందులు ఉన్నాయి. కరోనా పరీక్షలు చేసే ఆర్టీపీసీఆర్ను మంత్రి కేటీఆర్ మంజూరు చేయించారు. ఇప్పటికే జిల్లా ప్రజల కోసం అన్ని రక్త పరీక్షలు ఉచితంగా అందించేందుకు ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేశారు. సీటీస్కాన్లో సూక్ష్మమైన కరోనా కేసులు బయట పడుతున్నందున ఏరియా దవాఖానలో అందుబాటులో ఉంచారు.