హౌసింగ్బోర్డుకాలనీలో స్మార్ట్ సిటీ పనుల పరిశీలనలో మేయర్ సునీల్ రావు
యాభై శాతం రోడ్ల పనులు పూర్తయ్యాయని వెల్లడి
కార్పొరేషన్, డిసెంబర్ 20: కరీంనగర్లో స్మార్ట్సిటీలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీని మోడ్రన్ కాలనీగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. ఈ కాలనీలో రూ.64 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సోమవారం నగరంలోని హౌసింగ్బోర్డు కాలనీలో కొనసాగుతున్న స్మార్ట్సిటీ పనులను ఆయన పరిశీలించారు. కాలనీలో కొనసాగుతున్న స్మార్ట్ రోడ్స్, నిర్మాణంలో ఉన్న ఫుట్పాత్, రోడ్డు విస్తరణ తదితర పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్మార్ట్సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. నగరంలో స్మార్ట్సిటీ పనులన్నీ దశల వారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్మార్ట్ పనులకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. కాలనీలో చేపట్టిన పనుల్లో ఇప్పటికే 50 శాతం రోడ్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రోడ్లను కూడా అతి త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్మార్ట్ రోడ్ల నిర్మాణంలో ఫుట్ పాత్, కర్బ్వాల్ పొడవు ఎకువ కావడంతో రోడ్డు వెడల్పు తగ్గుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అయితే రానున్న భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కాలనీ నుంచి కాపువాడ వరాహస్వామి దేవాలయానికి వెళ్లే రోడ్డును కూడా స్మార్ట్సిటీ కింద అభివృద్ధి చేస్తామన్నారు. కాలనీలో పారు పనులు చివరి దశకు చేరాయని తెలిపారు. వచ్చే నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. మారుతున్న కాలానుగుణంగా నగరంలో పాఠకుల కోసం ఆధునిక డిజిటల్ లైబ్రరీ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రూ. 6 కోట్లతో నూతనంగా లైబ్రరీ భవనంతో పాటు మరో రూ.1.5 కోట్లతో డిజిటలైజేషన్ సేవలను నగర ప్రజలకు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆకుల ప్రకాశ్, ఈఈ రామన్, డీఈ ఓం ప్రకాశ్, స్మార్ట్సిటీ ప్రతినిధులు ప్రదీప్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.