వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నూతన సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఊహలకందని విధంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ లు, మండలాలు, రెవెన్యూ డివిజన్, నూతన జిల్లాలు, జోన్లతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయాల సముదాయం పనులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయ సముదాయం వద్ద పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్లకు కూడా ఈ సముదాయంలోనే గృహాలు నిర్మిస్తామన్నారు. అలాగే నూతన కలెక్టరేట్ను పరిశీలించి మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, కలెక్టర్ పౌసమి బసు, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల పాల్గొన్నారు.