రైతుల అమాయకత్వమే ఆసరాగా వ్యాపారం..
అధికారుల దాడులతో బయటపడుతున్న నకిలీ విత్తనాల బాగోతం
నకిలీలపై ఉక్కుపాదం మోపుతున్న సర్కార్
అక్రమార్కుల అగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతున్నది. రైతుల అమాయకత్వం.. అవసరాలను ఆసరాగా చేసుకొని అక్రమ వ్యాపారానికి తెరలేపిన కొందరు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఏటా వానకాలం, యాసంగి సీజన్లో అక్రమార్కులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి వారిని ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. అయితే, కర్షకులు నష్టపోకూడదని నకిలీల ఆట కట్టించేందుకు ఈ సారి ప్రభుత్వం రంగంలోకి దిగింది. నకిలీలపై ఉక్కుపాదం మోపుతున్నది.
ఏన్కూరు, జూన్ 17 : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలకు ఏన్కూరు అడ్డాగా మారింది. ఇక్కడ నుంచి కామేపల్లి, కారేపల్లి, కొణిజర్ల, తల్లాడ, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, చండ్రుగొండ మండలాలకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఈ నెల 1న ఏన్కూరు మండలంలోని బీఎన్తండాలో పట్టుబడిన నకిలీ మిర్చి విత్తన ముఠా కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఉభయ జిల్లాల్లో రూ.కోటికిపైగా నకిలీ మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకొన్నారు. తాజాగా ఈ నెల 16న ఏన్కూరులో రూ.5 లక్షల విలువైన 326 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు, నూకాలంపాడులో 151 లీటర్ల రూ.69,500 విలువైన నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో నకిలీల ఆగడాలకు అడ్డుకట్ట పడినట్లయింది. లేదంటే చాలా మంది రైతులు నకిలీల బారినపడి నష్టపోయేవారు.
మిర్చి, పత్తి పంటల సాగు అధికం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి, పత్తి పండించడంలో ఏన్కూరు ప్రథమ స్థానంలో ఉంది. ఇది ఆసరా చేసుకున్న వ్యాపారులు ఏన్కూరును నకిలీ విత్తనాల విక్రయాలకు కేంద్రంగా చేసుకున్నారు. గుంటూరు బయో మందులను ఇక్కడ విరివిగా విక్రయిస్తున్నారు. ఏటా రూ.2 కోట్ల బయో మందుల టర్నోవర్ జరుగుతున్నది. కొందరు వ్యాపారులు గ్రామాల్లో ఇళ్లలో దాచి గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. ఫెర్టిలైజర్ షాపుల్లో కొంత మంది నిషేధిత మందులతోపాటు బయో మందులు, గడువుతీరిన మందులను అమాయక రైతులకు అంటగడుతున్నారు. అసలు కంపెనీల మందులు అమ్మడం వల్ల లాభం తక్కువ వస్తుండడంతో నకిలీ మందులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే, ఏన్కూరు మండలంలో ప్రతి గ్రామంలో నకిలీ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై లోతుగా అన్వేషణ చేసి వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తే నకిలీలను పూర్తిస్థాయిలో అరికట్టే అవకాశం ఉంది.