కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 20 : శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్లు మంజూరయ్యాయని వీసీ ఆచార్య మల్లేశ్ సంకసాల, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023లో పీఎం ఉషా (ఉచ్ఛతర్ శిక్షా అభియాన్), రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) కింద ప్రతిపాదనలు పంపించారు.
ఈ మేరకు మంగళవారం దేశంలోని 78 యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేశారు. అందులో శాతవాహనకు 20 కోట్లు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా వీసీ మల్లేశ్ మాట్లాడుతూ, వివిధ పథకాల కింద నిధులు మంజూరు కావాలంటే యూనివర్సిటీకి 12(బీ) హోదా ఉండాలన్నారు. ఈ హోదా ఇచ్చిన సమయంలో యూజీసీ న్యాక్ గ్రేడింగ్ సాధించాలనే షరతు విధించారని చెప్పారు. న్యాక్ గ్రేడ్ ఉంటే 100 కోట్లు అదనంగా మంజూరయ్యేవని తెలిపారు. కాగా, 20 కోట్లలో 10 కోట్లు భవనాలకు, 6 కోట్లు నూతన ఆవిషరణలకు, 4 కోట్లు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి కోసం వినియోగిస్తామని వివరించారు.