రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
251 మందికి ఆరోగ్యలక్ష్మి యాప్తో కూడిన మొబైల్ ఫోన్ల అందజేత
గొల్లపల్లి, డిసెంబర్ 19 : అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని, అంగన్ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గొల్లపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గంలోని 251 మంది అంగన్ వాడీ టీచర్లకు ఆరోగ్యలక్ష్మి యాప్తో కూడిన మొబైన్ ఫోన్లను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంగన్ వాడీల సేవలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అంగన్ వాడీ టీచర్లకు పోషణ్ ట్రాకర్, ఆరోగ్యలక్ష్మికి సంబంధించిన డాటాను ఎంట్రీ చేయడం కోసం మొబైల్ ఫోన్ను అందజేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అంగన్ వాడీ టీచర్ల సేవలు ఎంతో ముఖ్యమని, వారు లేకుండా గ్రామాలను ఊహించుకోలేమన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వెళ్లి వారికి కావాల్సిన వస్తువులను అందించడంపై ప్రత్యేకంగా అభినందించారు. అంగన్ వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
దొంగ మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న అమాత్యుడు
అంతకుముందు మండలంలోని మల్లన్నపేట గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం మొక్కులు చెల్లించుకున్నారు. షష్ఠి మల్లన్న జాతర ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఎత్తు బంగారం (బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రభుత్వ నిధులు రూ. 50 లక్షలతో పూర్తయిన మల్లికార్జున స్వామి ఆలయ గాలిగోపురాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్, జడ్పీటీసీ జలంధర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, సర్పంచ్ నర్సయ్య, ఎంపీటీసీ రాజన్న, వైస్ ఎంపీపీ సత్తయ్య, చందోలి ప్యాక్స్ చైర్మన్ మాధవ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి, వైస్ చైర్మన్ గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బాబు, గొల్లపల్లి పట్టణాధ్యక్షుడు జలంధర్, సీడీపీవో సింగారాణి, సూపర్వైజర్ మమత, అరుణశ్రీ, పవిత్ర, నాయకులు సత్తయ్య, గంగారెడ్డి, గంగాధర్, లింగారెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
అనాథలకు అండగా అమాత్యుడు..
చిల్వకోడూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అనాథ చిన్నారులైన నాలుగేళ్ల అనన్య, రెండేళ్ల విశాల్ను మంత్రి ఈశ్వర్ అక్కున చేర్చుకొని అండగా నిలిచారు. వారి ధీన స్థితిని చూసి చలించిపోయారు. చిన్నారుల తల్లి సుంకె లత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా.. మద్యానికి బానిసైన తండ్రి పిల్లల పోషణ పట్టించుకోకపోవడంతో ఆ చిన్నారులను వృద్ధురాలైన నానమ్మ పోచమల్లవ్వ చేరదీసి పోషిస్తున్నది. ఆమె కూడా వయోభారంతో బాధపడుతూ కూలీ నాలీ చేసుకుంటూ చిన్నారులను అతి కష్టం మీద సాకుతున్నది. అయితే, మంత్రి ఈశ్వర్ ఆదివారం చిల్వకోడూర్ పర్యటనలో భాగంగా వీరి ధీనస్థితిని తెలుసుకున్నారు. వీరి పోషణ కోసం ఎల్ఎమ్ కొప్పుల చారిటబుల్ ట్రస్టు నుంచి ప్రతి నెలా రూ.5వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి కృతజ్ఙతలు తెలిపారు.