గల్లీలో ఓ మాట, ఢిల్లీలో ఓ మాట మాట్లాడుతున్న కమలనాథులు
నేడు మధురానగర్ చౌరస్తాలో చేపట్టే నిరసనను విజయవంతం చేయాలి
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, డిసెంబర్ 19: బీజేపీ బడా ఝూటా పార్టీ, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటన చేశారని గుర్తు చేశారు. కానీ, బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రం, ఎఫ్సీఐది అన్న విషయం మరిచి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కనీస అవగాహన లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.? బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏం చేసిందో వివరించాలని సవాల్ విసిరారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రవేశపెట్టిన ఒక్క పథకాన్ని చూపించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ తీరుకు నిరసనగా సోమవారం గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, శవయాత్ర, నల్ల జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మధురానగర్ చౌరస్తాలో నిర్వహించే నియోజకవర్గస్థాయి నిరసన కార్యక్రమానికి ఆయా మండలాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, ఏఎంసీ చైర్మన్లు సాగి మహిపాల్రావు, జనగం శ్రీనివాస్, గంట్ల వెంకట్రెడ్డి, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేచినేని నవీన్రావు, కత్తెరపాక కొండయ్య, పులి వెంకటేశ్గౌడ్, సర్పంచులు వేముల దామోదర్, మాల చంద్రయ్య, వెల్మ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పునుగోటి కృష్ణారావు, మిట్టపెల్లి సుదర్శన్, కొంకటి లచ్చిరెడ్డి, బందారపు అజయ్, గడ్డం చుక్కారెడ్డి, దూలం శంకర్గౌడ్, రామిడి సురేందర్, వేముల అంజి, తడిగొప్పుల రమేశ్, వంగల మల్లికార్జున్, మచ్చ రమేశ్, వెంకటరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.