పోషణ్ ట్రాకర్’ యాప్లో మాతా శిశు సమాచారం
లక్ష్యాలు సాధిస్తే ప్రతి నెలా పారితోషికం
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 19: మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే నిరంతర పర్యవేక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు, క్షేత్రస్థాయిలో పథకాల అమలు పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోషణ్ ట్రాకర్యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 14 రకాల రిజిస్టర్ల వివరాలను నమోదు చేసే అవకాశం ఉంది. కాగితాల పనికి స్వస్తి చెప్పి పూర్తి సమాచారం యాప్లోనే నిక్షిప్తం చేయడం వల్ల పారదర్శకతతోపాటు జవాబుదారీతనం పెరుగుతుంది.
జిల్లాలో 587 అంగన్వాడీలకు పంపిణీ
అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 4జీ స్మార్ట్ఫోన్లను అందించింది. అంగన్వాడీలు రోజువారీగా వారు చేసే పనుల వివరాలను స్మార్ట్ఫోన్లలోని ‘పోషణ్ ట్రాకర్’ యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిద్వారా క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 587 అంగన్వాడీ టీచర్లు, 24 మంది సూపర్వైజర్లకు 4జీ స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. వీరంతా ఇప్పటికే పోషణ్ ట్రాకర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని నిర్వహణపై శిక్షణ కూడా తీసుకున్నారు.
ఇవీ ప్రయోజనాలు..
స్మార్ట్ సేవల సౌలభ్యం వల్ల అంగన్వాడీలపై పనిభారం తగ్గనున్నది. టీచర్ల హాజరు, కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ సులభతరం కానున్నది. యాప్ అందుబాటులోకి రావడంతో అంగన్వాడీలపై రిజిస్టర్ల నిర్వహణ భారం తప్పనున్నది. అంతే కాకుండా యాప్లో ఎప్పటికప్పుడు నిర్దేశించిన లక్ష్యాలను చేరితే ప్రతి నెలా ప్రోత్సాహక పారితోషికం అందించనున్నారు.
ఆన్లైన్లో ఎప్పటికప్పుడు బాలింతలు, గర్భిణులు, చిన్నారుల వివరాల నమోదు వల్ల అధికారుల పర్యవేక్షణ సులభతరం కానున్నది.
కిశోర బాలికల సమాచారాన్ని నెల నెలా అప్డేషన్ చేయనున్నారు.