హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 19: హుజూరాబాద్ పట్టణంలోని నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, కులస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాలని, రానున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపునకు కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు. ఆదివారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన సారయ్య, శ్రీనివాస్ను హుజూరాబాద్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్, కొత్తగట్టు చక్రపాణి, నాయకులు కలిశారు. పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా నాయీ బ్రాహ్మణులకు త్వరలో అవసరమైన పనిముట్లను అందజేస్తామన్నారు. కమ్యూనిటీ హాల్ స్థలం, నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అధికార పార్టీ టీఆర్ఎస్కు అండగా నిలిచి, శ్రీనివాస్యాదవ్కు ఆశీస్సులు అందించాలన్నారు. ఇటీవల టీఆర్ఎస్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు తెలిపిన నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులను బస్వరాజు సారయ్య అభినందించారు. రెండు మూడు రోజుల్లో నాయీబ్రాహ్మణ, రజక సంఘం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ను సంప్రదించి భూమిపూజ కార్యక్రమం, నాయకులు, కులస్తులతో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ హనుమకొండ సెలూన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవల్లి సురేశ్కుమార్, యువజన విభాగం అధ్యక్షుడు సింగారపు శ్యామ్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, నాయీ బ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు.