తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితం
ఏడాదిన్నరగా దయనీయస్థితిలో మహిళ
చికిత్స కోసం రూ. 35 లక్షల ఖర్చు
అయినా మెరుగుపడని ఆరోగ్యం
అప్పులపాలైన కుటుంబం
ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల వేడుకోలు
ఎల్లారెడ్డిపేట, జనవరి 17: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కన్నబిడ్డను చూసి కన్నపేగు తల్లడిల్లుతున్నది. నోటిమాటలేక, మనుషులను గుర్తుపట్టని దయనీయ స్థితిలో చిక్కుకున్న ఆ కూతురిని చూస్తూ నిత్యం నరకం అనుభవిస్తున్నది..ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైన బిడ్డను చూసి ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూనే సపర్యలు చేస్తున్నది. కొనుక్కున్న ఇంటి స్థలాన్ని, వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని అమ్మి చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో గొల్లుమంటున్నది. తెచ్చిన అప్పులు తీర్చలేక, పేగుబంధాన్ని బతికించుకొనే దారి తెలియని దీనస్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది.
మండలంలోని బొప్పాపూర్కు చెందిన ఏలూరి ఎల్లయ్య-సుశీల దంపతుల రెండో కూతురు గీతను ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన తాలూక సతీశ్తో 2015లో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కూతుర్లు రిషిక, అనన్య. 2020 మేలో ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యం పాలైంది. చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కరోనా సమయంలో ఆమెకు నోటమాట బందయిపోవడంతో మనుషులను గుర్తుపట్టని పరిస్థితిలోకి వెళ్లింది. భర్త సతీశ్, తల్లిదండ్రులు రూ.10 లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. గీత అనారోగ్యం బారిన పడిన నాటి నుంచి తల్లిదండ్రులే సపర్యలు చేస్తూ బతికించుకు నేందుకు యత్నిస్తున్నారు. భర్త సతీశ్ ఏడాది క్రితం గీతను వదిలి వెళ్లి ఇప్పటి వరకూ చూసేందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమకు ఉన్న వ్యవసాయ భూమి అర ఎకరం, ఇంటి జాగ 175 గజాల అమ్మితే వచ్చిన రూ. 17 లక్షలు, మరో 8లక్షలు అప్పుతెచ్చి చికిత్స కోసం ఖర్చు చేశారు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. కన్నకూతురును బతికించుకునేందుకు ఉన్న ఆస్తిని అమ్మి అప్పుల పాలై చివరకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మా బిడ్డను బతికించి ప్రాణభిక్ష పెట్టాలని దీనంగా వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు ఏలూరి సుశీల, అకౌంట్ నంబర్ 202922010054054, ఐఎఫ్ఎస్సీ టీఎస్ఏబీ 0020029, కేడీసీసీ బ్యాంకు, బ్రాంచి ఎల్లారెడ్డిపేటకు లేదా ఫోన్ పే నంబర్ 8074945411లో నగదు జమ చేయాలని వారు అర్థిస్తున్నారు.