లాలపల్లిలో కొలువైన మల్లికార్జునస్వామి
నాలుగు దశాబ్దాల చరిత్రగలిగిన ఆలయం
ఐదు మహావృక్షాల సమాహారం
అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మల్లన్న ఉత్సవాలు
ఎలిగేడు, జనవరి 17;ఎలిగేడు మండలం లాలపల్లిలోని పంచవటీ క్షేత్రం అధ్యాత్మికత శోభతో ఫరిఢవిల్లుతున్నది.. ఐదు మహావృక్షాల సమాహారమైన ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నది..సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది ఇక్కడి మల్లికార్జునుడి సన్నిధికి వచ్చి పూజలు, ప్రదక్షిణలు చేయడం అనవాయితీగా వస్తున్నది..ఏటా సంక్రాంతి సందర్భంగా ఆరు రోజుల పాటు అంగరంగవైభవంగా మల్లన్న ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా లాలపల్లిలోని ‘పంచవటి’ (ఐదు మహావృక్షాల సమూహం) మల్లన్న క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఐదెకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయ ప్రాశస్థ్యాన్ని భావి తరాలకు తెలియజెప్పాలనే సత్సంకల్పంతో నలభై ఏండ్ల క్రితం గ్రామ ప్రముఖుడు, ఆధ్యాత్మిక వాది దివంగత మామిడి వెంకటరెడ్డి ఉత్తర భారతదేశంలోని ‘పంచవటి’ క్షేత్నాన్ని సందర్శించి అక్కడి నుంచి ‘జువ్వి, రావి, మర్రి, మేడి, వేప’ 5 మొక్కలు తెచ్చి నాటారు. ప్రస్తుతం ఇవి మహావృక్షాలై ఈ ప్రాంతానికి ఆహ్లాదకర వాతావరణాన్ని వెదజలుతున్నాయి. ఇప్పుడు వీటి సంరక్షణ బాధ్యతలను ఆలయ కమిటీతో పాటు వెంకటరెడ్డి కొడుకు ఉపాధ్యాయుడైన రవీందర్రెడ్డి చూస్తున్నారు. ఇటీవల ఆయన రూ. 50 వేలు వెచ్చించి ఈ వృక్షాల చుట్టూ గద్దెలను నిర్మించారు. అంతేకాకుండా ఆలయం లోపలిభాగాన్ని భక్తిభావం ఉట్టిపడేలా సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రదక్షిణలు చేస్తే సకల వ్యాధులు దూరం..
ఈ మహా పంచవటి వృక్ష సమూహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు, సకల వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం నిత్యం ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వందలాది మంచి వచ్చి ఆధ్యాత్మిక చింతనతో మల్లికార్జున స్వామిని దర్శించుకొని పంచవటి ప్రదక్షిణలు చేసి తరిస్తున్నారు. మర్రిని వటవృక్షంగా, విష్ణు వృక్షంగా భావిస్తారు. మారేడును భిల్వవృక్షంగా శివుడి స్వరూపంగా, రావిని అశ్వత్థవృక్షంగా భావిస్తారు. బుద్ధుడు ఈ వృక్షం కింద కూర్చొని బౌద్ధాన్ని స్వీకరించి బోధనలు చేశాడు అందువల్లనే దీనిని బోధివృక్షం అంటారు. వేపను నింబవృక్షంగా భావిస్తారు. దీని కిందే సాయిబాబా తన ఆశ్రమంగా చేసుకొని బోధనలు చేశాడని ప్రతీతి. ఉసిరిని ఆమ్ల వృక్షంగా పరిగణిస్తారు. ఇలా ఈ 5 వృక్షాలకు గొప్ప ప్రాశస్త్యం ఉంది. వీటిని దివ్య వృక్షాల సముదాయం అని అంటారు. పూర్వకాలంలో రుషులు, మునీశ్వరులు తమ పర్ణశాలల చుట్టూ నాటి పెంచేవారట, చారిత్రక ఆధారంగా చూస్తే సీతా-రామ-లక్ష్మణ సమేతంగా అరణ్యవాస కాలంలో తమ పర్ణశాలను ‘పంచవటి’ (ఐదు ఇలాంటి వృక్షాల సమూహం) వద్ద ఏర్పాటు చేసుకున్నట్లు, అదే విధంగా రామాయణ ఇతిహాసాలను బట్టి భరధ్వాజ, అగస్త్య మహర్షులుకూడా ఈ ‘పంచవటి’ మహావృక్ష సమూహం వద్దనే వాటినే తమ నివాసాలుగా చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
కొనసాగుతున్న మల్లన్న ఉత్సవాలు..
లాలపల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఏటా ఆరురోజుల పాటు నిర్వహిస్తున్న మల్లన్న ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 14న దిష్టికుంభంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. 16న ఆదివారం లగ్నపట్నంను కనులపండువలా జరిపించారు. 19న నాగవెళ్లి పట్నంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు.
భక్తుల విరాళాలతో ఆలయ అభివృద్ధి
భక్తులు విరివిగా విరాళాలు ఇస్తూ ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలకు ఎందరో ఇతోధికంగా సహకరించారు. గ్రామానికి చెందిన రాజేశ్వర్రెడ్డి, ఎలిగేడు సింగిల్విండో చైర్మన్ గోపు విజయభాస్కర్రెడ్డి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి ముందుకు వచ్చారు.