మెట్పల్లి రూరల్, అక్టోబర్ 16: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడేది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమేనని టీఆర్ఎస్ మెట్పల్లి మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మెట్పల్లి పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నాయకులతో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు ఐక్య వేదిక నాయకుల ముసుగులో పలు పార్టీలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకొని విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించడంలో ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం లేదనడం వారి పక్షపాత ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. మహారాష్ట్రలో నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీల తరహాలోనే సహకార పద్ధతిలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ని ఒప్పించి స్థానిక రైతులను అధ్యయనం కోసం మహారాష్ట్రలోని ఫ్యాక్టరీకి తీసుకెళ్లినట్లు తెలిపారు. కానీ రైతు ఐక్యవేదిక నాయకులమని చెప్పుకునే కొందరు ఫ్యాక్టరీ విషయంలో ఎమ్మెల్యే మాటలను వక్రీకరించడం విచారకరమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఐదు రోజుల్లోపు పసుపు బోర్డు తెస్తానని, సొంత ఖర్చులతో చక్కెర ఫ్యాక్టరీని కొనుగోలు చేసి నడిపిస్తానని బాండ్ పేపర్పై రాసిచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా హామీలను నిలబెట్టుకోలేని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను రైతు ఐక్య వేదిక నాయకులు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, సర్పంచులు గడ్డం లింగారెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, కాట శ్రీధర్, ఎంపీటీసీ నోముల గంగాధర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అనిరెడ్డి మారుతి, పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం రాజిరెడ్డి, నాయకులు పుల్ల జగన్గౌడ్, ఆరెళ్ల రాజాగౌడ్, అంకం శంకర్, చౌట్పల్లి అంజయ్య, అనిరెడ్డి మధు, గడ్డం రవి, కందరి సురేశ్, రాజశేఖర్, ముదాం నర్సింహులు పాల్గొన్నారు.