పెద్దపల్లిటౌన్, సెప్టెంబర్ 16: ప్రజలు చైతన్యవంతులై పోరాటాలు చేస్తేనే హక్కులు పొందడం సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన సీపీఐ బస్ జాతాకు ఘన స్వాగతం పలికి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. జెండా దగ్గర తిలక్నగర్లోని తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ చాడ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్ జాతా చేపట్టామని, ఇందులో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కలవేన శంకర్, తాండ్ర సదానందం, కొక్కిస రవీందర్గౌడ్, కోడం స్వామి, మారుపాక అనిల్, రమేశ్, శ్రీకాంత్, అంజి, ఈదూనురి ప్రేమ్కుమార్, మానస్కుమార్, బండారు సదానందం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఖనికి చేరిన సీపీఐ బస్సు జాత
కోల్సిటీ, సెప్టెంబర్ 16: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల్లో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు జాతా గురువారం గోదావరిఖనికి చేరుకుంది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన చౌరస్తా వరకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. సాయుధ పోరాటం గురించి కనీసం మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిందన్నారు. 4500 మంది కమ్యూనిస్టులు నేలకొరిగారని, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర ఉందన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలన్నారు. సీపీఐ నాయకులు గట్టయ్య, కనకరాజ్, మద్దెల దినేశ్, శంకర్, అనిల్, నరసింహ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, శ్రీమాన్, గౌతం గోవర్ధన్, మోహన్, మడ్డి ఎల్లయ్య, ప్రమీల, ఓదెమ్మ, మొగిలి, శ్రీకాంత్, రాంచంద్ర, ప్రీతం, సల్ల రవీందర్ ఉన్నారు.