ట్రాఫిక్ సిగ్నళ్లతో ట్రాఫిక్ కంట్రోల్
ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాలలో ట్రాఫిక్ సిగ్నల్స్,సీసీ కెమెరాలు ప్రారంభం
పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 16: సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నళ్ల వల్ల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.కోటితో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ట్రా ఫిక్ సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాలను ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి పట్టణం రద్దీగా మారిందని, ట్రాఫిక్ సమస్య సైతం పెరిగిందని, ఈ సమస్యకు పరిష్కారానికి రూ.50లక్షల టీయూఎఫ్ఐడీసీ నిధులతో పట్టణంలోని ఐదు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్, 14 ప్రాంతాల్లో బ్లింకర్స్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే రూ. 50లక్షల నిధులతో అత్యాధునిక పరిజ్ఞానం గల 113 సీసీ కెమెరాలను సైతం అమర్చామన్నారు. పోలీసు శాఖ నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజలను భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తుండడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పోలీసు శాఖ, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖ వారు చాలా కసరత్తు చేశారన్నారు. ధర్మపురి వైపు వెళ్లే బస్సులు పాత బస్టాండ్లోకి రాకుండా ధర్మపురి రోడ్డుపై నిలిపేలా పోలీసు శాఖ దృష్టిసారించి జిల్లా హాస్పిటల్కు చేరుకునేందుకు ఇబ్బందులను తొలగించాలన్నారు.
పోలీసు ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం కోసం రీ టెండర్ నిర్వహించామన్నారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ, ప్రభుత్వం శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నదన్నారు. సీసీ కెమెరాలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు ఎంతో దోహదపడుతాయన్నారు. ఎస్సీ సింధూశర్మ మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి చేరుకునే ప్రతీ ఎంట్రెన్స్, చివరి పాయింట్ల వద్ద 44 ప్రాంతాల్లో 113 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి మాట్లాడుతూ, పట్టణాభివృద్ధికి ప్రణాళితో ముందకెళ్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డీఎస్పీ ఆర్ ప్రకాశ్, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, నవీన్, నారాయణరెడ్డి, అనిల్, అధికారులు పాల్గొన్నారు.