పంటల సాగులో అధిక దిగుబడి సాధించాలి
ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం
భారత మాజీ వ్యవసాయ కార్యదర్శి ఎస్కే పట్నాయక్, సీహెచ్ఏఐ చైర్మన్ డా. హెచ్పీ సింగ్
వ్యవసాయ యూనివర్సిటీ(హైదరాబాద్), సెప్టెంబర్ 16: ప్రతినీటి బొట్టునూ ఒడిసిపట్టి, పంటల సాగులో అధిక దిగుబడి సాధించాలని భారత మాజీ వ్యవసాయ కార్యదర్శి ఎస్కే పట్నాయక్, సీహెచ్ఏఐ చైర్మన్ డా. హెచ్పీ సింగ్ సూచించారు. రాజేందర్నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఫర్డ్రాఫ్, మోర్ క్రాఫ్ (ప్రతి నీటి బొట్టుకు ఎక్కువ పంట) సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దేశం అతి త్వరలోనే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఉపకులపతి ప్రవీణ్రావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత విషయంలో నీరు కీలకమని పేర్కొన్నారు. అనంతరం యూనివర్సిటీ వీసీ ప్రవీణ్రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అనతి కాలంలోనే సాగు, తాగునీటి సౌకర్యం పెద్ద ఎత్తున కల్పించిందన్నారు. దీంతో ఉద్యానవన పంటల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని ఎఫ్సీఐ సైతం ధ్రువీకరించిందన్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో వ్యవసాయ పరిశోధనలకు గానూ రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచం అబ్బురపడే విధంగా స్వల్పకాంలోనే కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట సైతం ప్రతి బొట్టునూ ఒడిసిపట్టి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నదని కొనియాడారు. కాగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి డా. ప్రవీణ్రావు వ్యవసాయ రంగం, మైక్రోఇరిగేషన్లోనూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఏఎస్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. జాతీయ స్థాయి వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.