సిరిసిల్లలో ప్రముఖ టెక్స్టైల్స్ దిగ్గజం గోకల్దాస్ యూనిట్ ప్రారంభానికి రెడీ
వచ్చే నెలలోనే ముహూర్తం
త్వరలోనే తీరొక్క రకం దుస్తుల ఉత్పత్తి
ఇప్పటికే వందలాది మంది మహిళలకు నైపుణ్య శిక్షణ
అందుబాటులోకి వస్తే 1200 మందికి ఉపాధి
సర్వత్రా హర్షం
రాజన్న సిరిసిల్ల, జనవరి 16 (నమస్తే తెలంగాణ):వస్త్రనగరి సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరుతున్నది. రెడీమెడ్ ప్రపంచంలో కార్మిక క్షేత్రం ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు చేపట్టిన అప్పారెల్ పార్క్ సిద్ధమవుతున్నది. సంక్షోభంలో పడిపోయిన బీడీ పరిశ్రమలోని మహిళలు, యువతులకు ఉపాధి చూపాలనే మంత్రి కేటీఆర్ సంకల్పంతో 100 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్నది. ఈ పార్కులో తొలుత టెక్స్టైల్ దిగ్గజం గోకల్దాస్ యూనిట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్సయింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవడమే కాదు.. బెంగళూరుకు చెందిన టెక్నీషియన్లతో మహిళలకు స్టయిఫండ్తో కూడిన నైపుణ్య శిక్షణ కూడా అందిస్తున్నది. వచ్చే నెలలోనే కంపెనీని ప్రారంభించి, తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని యాజమాన్యం ప్రకటించింది. మొత్తంగా 80 శాతం మహిళలు పనిచేసే ఈ కంపెనీలో 1200 మందికి ఉపాధి దొరకనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరో కలికితురాయిగా నిలువబోతున్న అప్పారెల్ పార్కులో తొలి గార్మెంట్ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమవుతున్నది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో రూ.17 కోట్ల పెట్టుబడులతో ముందుకువచ్చిన గోకల్దాస్ కంపెనీ, వచ్చే నెలలో డ్రెస్సుల ఉత్పత్తిని మొదలు పెట్టబోతున్నది. ఇప్పటికే బెంగుళూరుకు చెందిన శిక్షకులతో మహిళలకు దుస్తుల తయారీలో స్టయిఫండ్తో కూడిన నైపుణ్య శిక్షణ ఇచ్చింది. వచ్చే నెలలోనే ప్రారంభానికి సన్నాహాలు చేస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మహిళలు, యువతులకు ఉపాధికి భరోసా..
వస్త్ర పరిశ్రమకే కేంద్ర బిందువైన సిరిసిల్లలో మరమగ్గాల వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా టెక్స్టైల్స్ పార్కు దినాదినాభివృద్ధి చెందుతున్నది. అయితే, మరమగ్గాల పరిశ్రమలో కేవలం పురుషులే ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు, యువతులు బీడీ పరిశ్రమనే నమ్ముకొని ఏండ్లుగా ఉపాధి పొందుతున్నారు. అయితే, బీడీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్నది. చాలా మంది ఇక్కడి యువతులు మేడ్చల్లోని గుండ్ల పోచంపల్లిలో ఉన్న గార్మెంట్ యూనిట్లో ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, యువతులకు మెరుగైన ఉపాధి కల్పించాలని మంత్రి కేటీఆర్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ట్ర సర్కారు దాదాపు రూ.200 కోట్లతో సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద 100 ఎకరాలలో అప్పారెల్ పార్కును నిర్మిస్తుండగా, గోకల్దాస్ కంపెనీ ముందుకు వచ్చి, తమ తొలి యూనిట్ను పెట్టింది.
ముందుకొస్తున్న పరిశ్రమలు
విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కంపెనీలను సిరిసిల్లకు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇన్నాళ్లూ కేవలం చీరలు, ముతక రకం వస్త్ర ఉత్పత్తులకే సిరిసిల్ల పరిమితమైంది. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో అన్ని రకాల దుస్తుల తయారీ కేంద్రంగా సిరిసిల్లను నిలబెట్టాలన్న సంకల్పంతో అప్పారెల్ పార్కును ఏర్పాటు చేశారు. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లకు ఇక్కడి వస్త్ర ఉత్పత్తిదారులకు అవగాహన కల్పించేందుకు సర్కారు సొంత డబ్బులతో స్టడీ టూర్కు పంపించింది. ఆయన చొరవతోనే గోకల్దాస్ ఇమేజ్ కంపెనీ ముందుకొచ్చింది. గత సంవత్సరం ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. జూలై 30న యూనిట్ నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 69 వేల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కంపెనీకి కేటాయించగా, రూ.17కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సర్కారు ప్రోత్సాహం, అధికారుల సహకారంతో నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టి, పూర్తి చేసింది.
మహిళలకు నైపుణ్య శిక్షణ
గోకల్దాస్ ఇమేజ్ కంపెనీకి వస్త్ర విపణిలో మంచి పేరుంది. బెంగుళూరు కేంద్రంగా తమ ఉత్పత్తులతో విశ్వ విపణిలో అడుగు పెట్టిన ఈ కంపెనీ అనేక రాష్ర్టాల్లో యూనిట్లు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. మంత్రి చొరవతో సిరిసిల్ల అప్పారెల్ పార్కులో యూనిట్ ఏర్పాటు చేసిన గోకల్దాస్ కంపెనీ వచ్చేనెలలో తమ ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. 80శాతం మహిళలకు ఉపాధి కల్పించనున్న ఈ కంపెనీలో మహిళలకు దుస్తుల తయారీలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. ఇప్పటికే బెంగుళూరుకు చెందిన 10 మంది శిక్షకులతో 100 మందికి శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. మొదట లోదుస్తులు, టీషర్టులు ఉత్పత్తి చేస్తారు. తర్వాత వివిధ రకాల దుస్తులు తయారు చేస్తారు. ఒక్కో కుట్టు మిషన్ రూ.50వేల నుంచి రూ. 2లక్షల వరకు ఉంటుంది. నెల రోజుల శిక్షణ కాలంలో ప్రతి మహిళకు రూ.3వేల స్టయిఫండ్ చెల్లిస్తున్నారు. 500 అధునాతన కుట్టు మిషన్లతో 1200 మందికి ఉపాధి కల్పించనున్నది. 18 సంవత్సరాలు పైబడిన యువతులు, మహిళలకు కంపెనీలో ఉపాధి లభించనున్నది. చేతినిండా పని, నెలకు రూ.10వేలకు పైగా వేతనం పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.