20 రోజుల్లోనే ఎనిమిది ఘటనలు
పెరుగుతున్న నేర ప్రవృత్తి
వరుస హత్యలతో జిల్లావాసుల బెంబేలు
తరిగిపోతున్న నైతిక విలువలు..
మాయమవుతున్న మానవ సంబంధాలు
క్షణికావేశంలో ఘాతుకాలు.. కటకటాల్లోకి వ్యక్తులు
పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలు
అవమానభారంతో వేదన పడుతున్న నిందితుల కుటుంబాలు
జగిత్యాల కలెక్టరేట్, జనవరి 16:జగిత్యాల జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లోనే ఎనిమిది హత్యలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. చిన్న చిన్న సమస్యలకే కోపోద్రిక్తులై కన్నవారనీ, కట్టుకున్నవారనీ, నమ్మినవారనే తేడా లేకుండా హతమారుస్తున్న తీరు, చర్చనీయాంశంగా మారింది. సాటి మనిషిపై ప్రేమ, అభిమానాన్ని చూపాల్సిన మనిషి పగ, కక్ష అంటూ పాశవికంగా అంతమొందిస్తున్న తీరు కలవరపెడుతున్నది. ఫలితంగా నిందితులు కటకటాలపాలవుతూ కుటుంబ సభ్యులకు అవమానభారాన్ని మిగుల్చుతుండగా, అటు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుండడం కలిచివేస్తున్నది.
నా అనే వాళ్లను హతమార్చాడని, ఇస్తానన్న కట్నం ఇవ్వలేదని, కుటుంబ కలహాలు, ఆస్తి, భూ పంపకాల్లో తేడా వచ్చిందని మనిషి మరో మనిషిని చంపుకుంటూ పోతున్నారు. క్షణికావేశంలో చిన్నచిన్న సమస్యలకే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేస్తున్నారు. ఫలితంగా కటకటాలపాలవుతూ కుటుంబాలకు అవమానభారాన్ని మిగుల్చుతున్నారు. అవతలి కుటుంబాలూ పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డునపడుతున్నాయి. జీవితం ఎంతో విలువైందని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కక్షలు, కార్పణ్యాల కారణంగా గడిచిన 20 రోజుల్లోనే జగిత్యాల జిల్లాలో (2021 డిసెంబర్ 27 నుంచి జనవరి 14) వరకు ఎనిమిది హత్యలు జరగడం జిల్లావాసులను కలవరపెడుతున్నది.
2021లో 26 హత్యలు..
జిల్లా వ్యాప్తంగా గడిచిన ఏడాదిలో వివిధ కారణాలతో 26 హత్యలు నమోదయ్యాయి. జరిగిన హత్యలకు కారణాలను విశ్లేషిస్తే ఎక్కువగా కుటుంబ కలహాలు, ఆస్తి, భూ తగాదాలు, వివాహేతర సంబంధాలేనని తెలుస్తున్నది. కుటుంబ కలహాలతో ఐదు హత్యలు, భూ తగాదాల కారణంగా ఐదు మర్డర్లు, వివాహేతర సంబంధాల కారణంగా నాలుగు, తీసుకున్న అప్పు తిరిగివ్వమన్నందుకు గాను రెండు, చిన్నచిన్న గొడవల కారణంగా నాలుగు హత్యలు, మంత్రాల నెపంతో రెండు హత్యలు జరిగాయి. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని హత్యల వివరాలు..
ఫ్యాక్షన్ తరహా ఘాతుకాలు..
జిల్లాలో ఫ్యాక్షన్ తరహాలో హత్యలు వెలుగుచూశాయి. ఈ నెల 9, 13న వేర్వేరుచోట్ల ఇద్దరు యువకులను ప్రత్యర్థులు పక్కాగా ఫ్యాక్షన్ తరహాలో అంతమొందించడం జిల్లాలో కలకలం రేపింది. ధరూర్కు చెందిన ఈరిశెట్టి రాజేశ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గంగారెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్నాడు. కేసు కోర్టులో నడుస్తున్నది. రాజేశ్ ఈ నెల 9న ఉదయం బైక్పై పొలానికి వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాజేశ్ను తల్వార్తో పొడిచి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తండ్రి గంగారెడ్డిని హత్య చేశాడనే కక్షతోనే గంగారెడ్డి కొడుకులు ఈరిశెట్టి వేణు, సతీశ్, సంతోష్ కలిసి రాజేశ్ను హత్య చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే 13వ తేదీన ఇబ్రహీంపట్నం మండలంలో రాజేందర్ అనే యువకుడిని సైతం ఇదే తరహాలో పొలంలోనే గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేయడం జిల్లాలో కలకలం రేపింది.
అదనపు కట్నం కోసం అత్తను కడతేర్చి..
కొడిమ్యాల మండలం కోనాపూర్కు చెందిన జడ రాజవ్వకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉండ గా, భర్త 15 ఏండ్ల కింద, కొడుకు ఏడేళ్ల క్రితం మృతి చెందారు. అయినా, రాజవ్వ కూతుళ్లను చదివించి వివాహాలు చేసింది. చిన్న కూతురు మౌనికను కథలాపూర్ మండలం బొమ్మెనకు చెందిన మేనల్లుడు అమరగొండ గంగాధర్కు ఇచ్చి రెండేళ్ల కింద వివాహం జరిపించగా, అదనపు కట్నం కోసం గంగాధర్ భార్య మౌనికను, అత్త రాజవ్వను వేధించసాగాడు. తర్వాత గల్ఫ్ కు వెళ్లిన గంగాధర్ రెండు నెలల క్రితం స్వగ్రామానికి చేరుకొని అదనపు కట్నం, ఎకరం భూ మి ఇవ్వాలని అత్తతో గొడవకు దిగాడు. దీంతో మౌనిక తల్లి వద్దనే ఉంటున్నది. గత నెల డిసెంబర్ 28న భార్యను కాపురానికి పంపించాలని గంగాధర్ కోనాపూర్కు వచ్చి భార్య, అత్తతో గొ డవ పడ్డాడు. గొడవ ఎక్కువ కాగా తీవ్ర కోపోద్రిక్తుడైన గంగాధర్ కర్రతో అత్త రాజవ్వపై దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి..
మెట్పల్లిలోని బోయవాడకు చెందిన వాల్గోట్ కిశోర్, మెట్పెల్లి మండలం బండలింగాపూర్కు చెందిన కాశబోయిన నిషిత(25) అలియాస్ హన్షిత ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2018 మార్చిలో వివాహం చేసుకున్నా రు. వివాహ సమయంలో నిషిత తల్లిదండ్రులు రూ.2 లక్షల కట్నం ఒప్పుకొని రూ.లక్ష, ఇతర లాంఛనాలు అందజేశారు. పెండ్లి సమయంలో ఇస్తానన్న కట్నం తేవాలని నిషితను కిశోర్ వేధించాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని నిషితను బలవంత పెట్టి గత నవంబర్ 5న ఒక సూసైడ్ నోట్ రాయించాడు. విషయం పెద్దలకు తెలిసింది. ఇద్దరికి సర్దిచెప్పారు. కానీ, కిశోర్ గత డిసెంబర్ 28న ఉదయం నిషిత మెడకు తాడు చుట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విచారణలో భార్యను హత్య చేసిన విషయాన్ని కిశోర్ ఒప్పుకొన్నాడు.
తీసుకున్న అప్పు తిరిగివ్వమంటే..
జగిత్యాలలోని సుతారిపేటకు చెందిన ఖాజా హమీదుద్దీన్ (77) తన ఇంటిని అమ్మగా వచ్చిన 50 లక్షలను జగిత్యాలకు చెందిన ముదస్సర్ అలీకి ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వమని హమీదుద్దీన్ పలుసార్లు ముదస్సర్ అలీపై ఒత్తిడి తేగా 35 లక్షలు చెల్లించాడు. మిగతా మొత్తం 15 లక్షలు డిసెంబర్ 21న ఇస్తానని తెలిపాడు. అయితే, హమీదుద్దీన్కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, హమీదుద్దీన్ను హత్య చేసేందుకు ముదస్సర్ తన స్నేహితుడు ఇమ్రాన్ సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం డిసెంబర్ 21న రాత్రి గొలుసుతో గొంతు నులిమి హత్య చేసి ఖిల్లాకు ఆనుకుని ఉన్న నీటి కందకంలో పడేశారు. డిసెంబర్ 30న మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తాగొచ్చి వేధిస్తున్నాడని తండ్రిని..
మద్యం మత్తులో ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడనే నెపంతో కొడుకు తండ్రిని హతమార్చాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య (45) నిత్యం తాగివచ్చి ఇంట్లో గొడవచేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న అర్ధరాత్రి మద్యం తాగివచ్చి మత్తులో భార్య లక్ష్మిని బూతులు తిడుతూ దాడి చేశాడు. అక్కడే ఉన్న వీరి పెద్ద కొడుకు దుర్గం పవన్ కోపోద్రిక్తుడై కర్ర తీసుకొని తండ్రి తలపై బాదగా చంద్రయ్య కిందపడి పోయాడు. చీకట్లో అతడిని అక్కడే వదిలేసి కుటుంబసభ్యులంతా నిద్రించారు. కానీ శుక్రవారం ఉదయం లేచే సరికి చంద్రయ్య రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు.
పాత కక్షలతో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడి..
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మామిడి లస్మయ్య అలియాస్ ఎర్రన్న (47) దారుణ హత్యకు గురయ్యాడు. లస్మయ్యతో వీరి ఇంటి పక్కన ఉండే దాసరి వినోద్కు మధ్య గతంలో గొడవలున్నాయి. ఈ నెల 14న శుక్రవారం పం డుగ పూట వీరిరువురి మధ్య కొద్దిపాటి గొడవ జరిగింది. ఈ సమయంలో వినోద్ క్షణికావేశంలో తన ఇంటి దగ్గర ఉలితో లస్మయ్యపై దాడి చేసి కడుపులో పొడిచాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు లస్మయ్యను మెట్పల్లిలోని దవాఖానకు తరలించగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు మెట్పల్లి సీఐ శ్రీను తెలిపారు.