కరీంనగర్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
బండి సంజయ్వి పచ్చి అబద్ధాలు
నలుగురు ఎంపీలున్నా రాష్ర్టానికి ఒక్క పైసా తేలె
ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్ ప్రారంభోత్సవంలో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కొత్తపల్లి, జనవరి 16: కరీంనగర్ జిల్లా మరికొన్ని నెలల్లో పర్యాటక కేంద్రంగా మారబోతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. కరీంనగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఐటీ టవర్, స్మార్ట్సిటీ హోదా, మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ వంతెన నిర్మాణమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రూ. కోటీ 90 లక్షల స్మార్ట్సిటీ నిధులతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్ను వారు ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటికీ కేంద్రం డబ్బులు ఇస్తున్నదంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక్కడి నుంచి నలుగురు బీజేపీ ఎంపీలున్నా రాష్టానికి ఒక్క పైసా తేలేదని విమర్శించారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్కు మాత్రమే కేంద్రం స్మార్ట్సిటీ హోదా ఇస్తామని ప్రకటించగా సీఎం కేసీఆర్ ప్రధాని, కేంద్ర మంత్రులతో మాట్లాడి కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా తీసుకువచ్చారని గుర్తు చేశారు. స్మార్ట్సిటీ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కేంద్రం వాటా 50 శాతం ఉంటే రాష్ట్రం వాటా 50 శాతం ఉందని తెలిపారు. సుమారు రూ.21 కోట్లకు పైగా నిధులతో అంబేద్కర్ స్టేడియంలో క్రీడాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇందులో రూ.1.55 కోట్లతో ఇండోర్ స్టేడియం అభివృద్ధి, రూ. 35 లక్షలతో స్కేటింగ్ రింక్, రూ. 35 లక్షలతో బాస్కెట్బాల్ కోర్టులు, రూ.8 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, ఇతర క్రీడా స్థలాల నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు.
మానేరు తీర సమీపంలోని క్రీడా పాఠశాలలో సుమారు రూ.8 కోట్లతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తి కావస్తున్నదని చెప్పారు. క్రీడా సౌకర్యాల మెరుగుతో రాబోయే రోజుల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి పల్లె ప్రగతి నుంచి నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటున్నామన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మన దగ్గర జరిగిన అభివృద్ధిలో కనీసం 10 శాతం మేర చేశారో? లేదా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బీజేపీ సీఎంలు వారి రాష్ర్టాల్లో ఎక్కడా కూడా 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా అందించడం లేదన్నారు. పెట్టుబడుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎస్బీఐ ప్రకటించడం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. సాంఘిక సంక్షేమ పథకాల అమలులో సైతం తెలంగాణ రాష్ట్రం ముందున్నదన్నారు. టీఆర్ఎస్కు చెందిన ప్రజా ప్రతినిధులు ఒక విజన్తో ముందుకు వెళ్తూ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చేసే తప్పుడు ఆరోపణలపై ఇకనుంచి ఎప్పటికప్పుడు నిలదీస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నగర మేయర్ వై సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డీవైఎస్వో కే రాజవీరు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి, పలు క్రీడా సంఘాల బాధ్యులు, పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.