కార్పొరేషన్, జనవరి 16 ;కరీంనగర్కు ఒడిలో మరో కళాతోరణం చేరబోతున్నది. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల కోసం హైదరాబాద్లోని రవీంద్రభారతిని మించిన సౌకర్యాలతో ‘అమృత వర్షిణి’ పేరిట అద్భుత నిర్మాణాన్ని చేపట్టేందుకు నగరపాలక సంస్థ సిద్ధమవుతున్నది. స్మార్ట్ సిటీ కింద నగరంలోని ఎస్సారార్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు కూడా తయారు చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర సర్కారు 12.50 కోట్ల నిధుల కేటాయించగా, 500 మంది సిట్టింగ్ కెపాసిటీ, అత్యాధునిక సౌండ్ సిస్టంతో నిర్మించబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల కోసం అత్యంత ఆధునిక సదుపాయాలతో అమృతవర్షిణి పేరిట అద్భుత నిర్మాణం చేపట్టేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగరంలో ఉన్న ఏకైక కళాభారతి ప్రస్తుతం సరైన సదుపాయాలు లేక అంతంత మాత్రంగానే నడుస్తున్నది. దీనికి మార్పులు చేసి ఆధునిక సదుపాయాలతో మంచి కళాభారతి నిర్మించాలని గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిపాదనలు చేయగా, ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా పదేళ్ల కిత్రం ఆధునికంగా కళాభారతి నిర్మిస్తామంటూ అప్పటి ప్రభుత్వ పెద్దలు కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల ఆవరణలో గల స్థలంలో పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. తర్వాత గత ఐదేళ్లలో కూడా నూతన కళాభారతి నిర్మాణానికి సమాలోచనలు చేసినా, కొన్ని కారణాలతో పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే, ప్రస్తుత నగరపాలక వర్గం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎస్సారార్ కాలేజీ సమీపంలోనే అత్యంత ఆధునిక సదుపాయాలతో అద్భుత నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.12.50 కోట్ల నిధులతో రవీంద్రభారతికి మించిన సదుపాయాలు ఉండేలా దీనిని తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
అత్యాధునిక సదుపాయాలతో..
నగరంలో చేపట్టబోతున్న కళాభారతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు రూ.12.50 కోట్లు వ్యయం చేయనుండగా, ఇప్పటికే డిజైన్ కూడా ఫైనల్ చేశారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో సదుపాయాలు, అత్యంత ఆధునిక సౌండ్ సిస్టం, కళాకారుల కోసం అన్ని వసతులు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఒక చోట 500.. మరో చోట 100 మంది కూర్చొనే విధంగా రెండు వేర్వేరుగా హాల్స్ నిర్మించే విధంగా ఏర్పాట్లు చేశారు. సౌండ్ సిస్టంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా సౌండ్ ప్రూవ్స్ వినియోగిస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక నిర్మాణాలు, పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లను నిర్మించబోతున్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.