పెద్దపల్లి, సెప్టెంబర్ 13 : స్వచ్ఛతలో పెద్దపల్లి జిల్లాను బ్రాండ్ అంబాసిడర్గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023లో ఎంపికైన 15 గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉత్తమ గ్రామాలుగా ఎంపికైన సర్పంచులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలాభివృద్ధే రాష్ట్ర, దేశాభివృద్ధికి నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల ప్రగతికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఫలితంగా జిల్లా అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిసున్నదని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలోని 266 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ప్లస్గా ప్రకటించారని తెలిపారు. ప్రతి గ్రామంలో డంప్యార్డ్, ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, కంపోస్ట్ షెడ్డు, నర్సరీ, వైకుంఠధామం వంటి వసతులున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీధర్, డీపీవో చంద్రమౌళి తదితరులు అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛత, పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత. గ్రామాలు, పట్టణాల్లో శుభ్రత నిరంతరం కొనసాగుతుంది. స్వచ్ఛత అంశంలో పెద్దపెల్లి జిల్లా వరుసగా అగ్రస్థానంలో నిలిచి జాతీయ స్థాయి అవార్డులను సాధిస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్, స్వచ్ఛ సుందర్ శౌచాలయ్, స్వచ్ఛ దర్పణ్ కింద జిల్లాకు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు వచ్చాయి. జిల్లాలోని 266 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించుకున్నాం. భవిష్యత్లో ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధన దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా కృషి చేయాలి. గ్రామ పంచాయతీలు అవార్డులు సాధించిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడం చాలా కీలకం. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో మంచి ప్రదర్శన కనబరిచిన జీపీలను ఎంపిక చేసి జిల్లా స్థాయి అవార్డులను అందిస్తున్నాం. మొత్తం 15 గ్రామాలను ఉత్తమంగా ఎంపిక చేసి అవార్డులు అందించాం.
– ముజామ్మిల్ ఖాన్, కలెక్టర్ (పెద్దపల్లి)