మల్యాల, ఫిబ్రవరి 24 : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో గురువారం అర్ధరాత్రి తర్వాత భారీ చోరీ జరిగింది. ముగ్గురు దుండగులు సుమారు 9 లక్షల విలువైన వెండి వస్తువులను అపహరించుకుపోయారు. ఆలయ ఈవో వెంకటేశం ఫిర్యాదు మేరకు జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు భక్తుల ముసుగులో అర్ధరాత్రి దాటాక 1:20 గంటల సమయంలో ఆలయం వెనుక వైపు ఉన్న చానల్ గేట్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. అ్కడి నుంచి ప్రధాన ఆలయం వద్ద గల తాళాలను పగలగొట్టి ఆలయంలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. కాగా, ఉదయం సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచేందుకు సిబ్బంది వెళ్లే క్రమంలో వస్తువులు, తాళాలు చిందరవందరగా పడి ఉండడంతో గమనించి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మల్యాల సీఐ రమణమూర్తి, మల్యాల, కొడిమ్యాల ఎస్ఐలు మంద చిరంజీవి, వెంకట్రావు ఆధారాల సేకరించడం ప్రారంభించారు. ఆలయంలోకి అర్చకులు, అధికారులు, భక్తులకు అనుమతి లేకుండా ద్వారాలను మూసివేసి, క్లూస్ టీం, ఫింగర్ప్రింట్, డాగ్స్కాడ్ టీం, ఐటీ కోర్, టెక్నికల్ విభాగం, సీసీఎస్ సిబ్బందితో ఆధారాలు సేకరించడంతోపాటు ఈవో వెంకటేశం, చైర్మన్ మారుతీస్వామీ, అర్చకులు జితేంద్రప్రసాద్, రామకృష్ణ, చిరంజీవస్వామి, రఘు ద్వారా పూర్తి వివరాలను సేకరించారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారం ప్రకారం ప్రాథమికంగా ముగ్గురు దొంగతనంలో పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు.
12 వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తింపు
ఆలయంలోని వేంకటేశ్వరస్వామికి చెందిన 2 శటారిలు, ఆంజనేయస్వామికి చెందిన ప్రతిరూప వెండి కవచం, మకరతోరణం, స్వామి వారి కిరీటం, ఛత్రం (గొడుగు), 2 శటారిలు, ఒక రామరక్ష, ఆలయం గోడకు వేసిన వెండి తొడుగులను తొలగించి మరీ ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆలయ అధికారులు రికార్డుల ఆధారంగా దొంగిలించిన వెండి సుమారు 15 కిలోల వరకు ఉంటున్నట్లు ఆలయ అధికారులు అంచనాకు వచ్చారు. తమ సిబ్బందికి లభించిన ఆధారాల ప్రకారం ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐల నేతృత్వంలో పది ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదించేందుకు తమ శాఖ చర్యలు చేపట్టిందని డీఎస్పీ తెలిపారు.
సంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి
అంజన్న గర్భగుడిలోని వస్తువులు చోరీకి గురికావడం, పోలీస్ జాగిలం ద్వారా వివరాలు సేకరించినందున ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని పూర్తి స్థాయిలో సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు విచారణ జరిపిన తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించారు. కాగా, చోరీ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ ఆధారంగా పలు ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
మరో రెండు ఆలయాల్లోనూ చోరీ
కొండగట్టుతోపాటు మరో రెండు ఆలయాల్లోనూ గురువారం రాత్రి చోరీలు జరిగాయి. ధర్మపురి మండలంలోని రాయపట్నం శివారులోని శివాలయంలో తాళం పగులగొట్టి దాదాపు రూ.6వేల విలువైన అమ్మవారి మెడలోని మంగళసూత్రం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. హండీని కొంతదూరం తీసుకెళ్లి పగులగొట్టే ప్రయత్నం చేశారు. తాళం రాకపోవడంతో అక్కడే పడేసి వెళ్లారు. అలాగే జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీకి యత్నించారు. ఆఫీస్ కార్యాలయంలో బీరువాను పగలగొట్టారు. అందులో ఎలాంటి డబ్బులు దొరకకపోవడం, గర్భగుడి తాళాలు పగలగొట్టేందుకు యత్నించారు. సీసీ కెమెరాకు సంబంధించిన డీవీఆర్ ఎత్తుకెళ్లారు.