ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు
అడగకముందే వరాలిచ్చే దేవుడు కేసీఆర్
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
జడ్పీ అధ్యక్షురాలు వసంతతో కలిసి మెట్పల్లి మండలం సత్తక్కపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం
మెట్పల్లి రూరల్, అక్టోబర్ 14: ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు ఏది కావాలో అడగకముందే వరాలిచ్చే దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామంలో ఒక్కో ఇంటికి రూ. 5.04 లక్షల చొప్పున మొత్తం రూ. 40.32 లక్షలు వెచ్చించి నిర్మించిన ఎనిమిది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి గురువారం ప్రారంభించారు. లబ్ధిదారులతో పూజలు చేయించి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 20వేల మంది ఇళ్లులేని నిరుపేదలున్న ట్లు అంచనా వేశామని, రెండేళ్లుగా కరోనాతో ప్ర భుత్వ ఆదాయం పడిపోయిందని, లేకుంటే నియోజకవర్గానికి ఐదారువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చేవన్నారు. ప్రస్తుతం సొంత స్థలాల్లో కూ డా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సత్తక్కపల్లికి ఆరు ఇళ్లు మంజూరు ఇప్పిస్తానని హామీనిచ్చారు. రెండో దఫాలో గుడిసెలున్న వారికి కూ డా ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆలోచన ఉందన్నారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. గతంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు నామమాత్రంగా ఉన్నాయని, ప్రస్తుతం పేదల జీవనం కూడా గొప్పగా ఉండాలనే ఆలోచనతో చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్లనిర్మాణం జరుగుతున్నదన్నారు.
ఇటీవల పలు పార్టీల నాయకులు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తున్నారని, వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కట్టివలేదని విమర్శించారు. పసుపుబోర్డు తెప్పిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన నాయకుడు హామీని నిలబెట్టుకోకపోవడంతో పాటు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ పోతుగంటి రాజేందర్, ఎంపీడీవో భీమేశ్, పీఆర్ డీఈ గోపాల్, ఆర్ఐ సంధ్యారాణి, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డి, ఆరెళ్ల రాజాగౌడ్, సర్పంచులు పీసు తిరుపతిరెడ్డి, కాట శ్రీధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జీవితమంతా రుణపడి ఉంటాం
20 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ అరిగోస పడుతున్న మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సీఎం కేసీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సార్లకు జీవితమంతా రుణపడి ఉంటాం. నేను బీడీలు చుడుతూ, నా భర్త జగదీశ్ గీత కార్మిక పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఒక కొడుకు, ఒక కూతురున్నారు. మాకు సొంత జాగ తీసుకొని ఇల్లు కట్టే శక్తి అసలే లేదు. దీంతో ఇన్నాళ్లు అద్దె ఇళ్లల్లోనే ఎల్లదీశాం. బీడీ పింఛను రావడంతో కుటుంబానికి కొంత ఆసరా ఉంది. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ఇల్లు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి జీవతమంతా అండగా నిలబడుతాము.