దివ్యాంగులు,వృద్ధుల అభ్యున్నతికి సర్కారు పెద్దపీట
ఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాల పంపిణీ
నెలనెలా ఠంఛన్గా ఆసరా పింఛన్లు
17 నుంచి 25 వరకు ప్రత్యేక శిబిరాలు
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 14;సంక్షేమ పథకాలతో సబ్బండవర్గాలకు మేలు చేస్తున్న సర్కారు దివ్యాంగులు, వయోవృద్ధుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నది. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్నది. ఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాలను అందజేస్తూ చేయూతనందిస్తున్నది. ఇందులో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది.
జిల్లాలోని ఆయా మండలాల్లో స్పెషల్ క్యాంపులను నిర్వహించి అర్హులైన దివ్యాంగులను గుర్తించి వారికి ఉపకరణాలు. సహాయ పరికరాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ దిశగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వాల్పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో దివ్యాంగులు, వృద్ధులకు వారి అవసరాలకు అనుగుణంగా పరికరాలు అందించనున్నారు.
దివ్యాంగులకు..
చేతి కర్రలు, వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, ఎంఎస్ఐడీ కిట్, స్మార్ట్ చేతి కర్ర, కృత్రిమ అవయవాలు, బ్యాటరీ ఆపరేటెడ్ మోటర్ ట్రైసైకిళ్లు అందించనున్నారు.
వయోవృద్ధులకు..
60 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు చేతి కర్రలు, వీల్చైర్స్, వాకర్స్, వాష్రూమ్ వీల్చైర్, నడుం పట్టి, మెడ పట్టి, కండ్ల అద్దాలు, వినికిడి యంత్రాలు, ఫుట్ కేర్ యూనిట్, వాకింగ్ స్టిక్ విత్ సెట్, కృత్రిమ దంతాలు, నీ-బ్రేస్, రోలేటర్ విత్బ్రేక్ వంటి పరికరాలు అందజేయనున్నారు.
శిబిరాల షెడ్యూల్
బోయినపల్లి రైతు వేదిక: ఈ నెల 17వ తేదీన
ఇల్లంతకుంట రైతు వేదిక: ఈ నెల 18న వేములవాడ సినారె కళామందిరం: ఈ నెల 19 నుంచి 21 వరకు సిరిసిల్ల సినారె కళామందిరం: ఈనెల 22 నుంచి 25 వరకు క్యాంపులు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
తీసుకురావాల్సిన పత్రాలు..
దివ్యాంగులు : సదరం ధ్రువీకరణ పత్రం లేదా ఏదైనా వైద్యుడు ఫిజీషియన్ ఇచ్చిన 40 శాతం వైకల్యం మించినట్లు సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు.
వయోవృద్ధులు: తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఒకవేళ అవి లేకుంటే నెలకు రూ.15000 ఆదాయం మించలేదని సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ ఇచ్చే సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పింఛన్ ఐడీకార్డు, ఓటర్ ఐడీ కార్డు వయసు నిర్ధారణ కోసం తీసుకురావాలి. ఇందు కు సంబంధించి ఏర్పాట్లను జిల్లాకలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు సంక్షేమాధికారి లక్ష్మీరాజం పర్యవేక్షిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఏఎల్ఐఎంసీవో సంస్థ ఆధ్వర్యంలో ఏడీఐపీ పథకం ద్వారా దివ్యాంగులు, ఆర్వీవై స్కీం కింద వయోవృద్ధులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఇందుకు జిల్లాలోని పలుచోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు సంబంధిత పత్రాలతో హాజరుకావాలి. అర్హతలేనివారు వచ్చి ఇబ్బందులు పడవద్దు.