గంగాధర మండలంలో అందుబాటులోకి రైతు వేదికలు
సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్న అన్నదాతలు
గంగాధర, జనవరి 14: గ్రామాల్లో రైతులంతా ఒక చోట సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, వ్యవసాయానికి సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారంచుట్టింది. గంగాధర మండలంలో ఐదు క్లస్టర్లు ఉండగా క్లస్టర్కు ఒకటి చొప్పున రైతుల వేదికల నిర్మాణానికి రూ. కోటి 10 లక్షలు మంజూరు చేసింది. రైతు వేదికల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో మండల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సుందరంగా రైతు వేదికల నిర్మాణం
మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఇందులో గర్శకుర్తి, కురిక్యాల, మల్లాపూర్, గంగాధర, బూరుగుపల్లి గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ. 22 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. అన్ని క్లస్టర్లలో రైతు వేదికలు పూర్తి కాగా, రైతులు సమావేశం నిర్వహించుకోవడానికి సమావేశ మందిరం, మందిరం ముందు వేదిక ఏర్పాటు చేశారు. క్లస్టర్ వ్యవసాయాధికారి, కార్యాలయం కోసం గది నిర్మించారు. అంతే కాకుండా రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి సైతం ఉపయోగించుకునేలా రైతు వేదికల నిర్మాణం చేపట్టారు.
ప్రభుత్వ పథకాలను వివరిస్తూ చిత్రాలు
వ్యవసాయ ప్రాధాన్యతను తెలియజేసేలా రైతు వేదిక బయట, లోపల ప్రత్యేకమైన చిత్రాలు సర్వంగా సుందరంగా వేయించారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అన్నదాతలకు అవగాహన కల్పించేలా చక్కని డిజైన్లు వేశారు. వేదిక లోపల వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, పచ్చదనంతో కళకళలాడుతున్న తెలంగాణ రాష్ట్రం చిత్రపటాన్ని గీశారు. నాగలి ఎత్తుకున్న రైతు, వరి కంకి గొలకలతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతుల బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల గురించి వివరించేలా చిత్రాలు వేశారు. అలాగే, రైతు వేదికకు హరిత సొబగులు అద్దడానికి చుట్టూ మొక్కలు నాటారు. ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించిన సమావేశాలను రైతు వేదికల్లోనే అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.