ఇల్లంతకుంట, జనవరి 14: రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని రేపాక సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జంగంరెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన కూరగాయల విక్రయ షెడ్డును ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దళితులకు డప్పులు పంపిణీ చేశారు. ప్రకృతి వనంలో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కూరగాయల విక్రయ షెడ్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ముస్కానిపేటలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నిర్వహించిన గోదాదేవి కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి, ఏపీవో చంద్రయ్య, సర్పంచులు రోండ్ల లక్ష్మి, తూంకుంట శ్రీలత, ఎలుక లక్ష్మి, ఎంపీటీసీ సావనపెల్లి వనజ తదితరులు పాల్గొన్నారు.