హుజూరాబాద్ పట్టణంలో స్వామి వారి ఆభరణాలు ఊరేగింపు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హుజూరాబాద్టౌన్, జనవరి 14: హుజూరాబాద్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం సాయంత్రం అయ్యప్ప మకరజ్యోతి దర్శనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం అయ్యప్ప స్వామి తిరు ఆభరణాలను పట్టణంలో మేళతాళాల మధ్య భక్తిశ్రద్ధలతో అయ్యప్ప భక్తులు ఊరేగించారు. అనంతరం అయ్యప్ప ఆలయం వద్ద ఉత్సవ విగ్రహాలు, మూలవిరాట్టును ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి, మకరజ్యోతి దర్శనం గావించారు. దీంతో అయ్యప్ప స్వాముల జ్యోతి దీక్ష పరిపూర్ణమైనట్లు గురుస్వాములు తెలిపారు. ఊరేగింపులో భక్తుల శరణుగోషతో పట్టనం మార్మోగింది. మహిళలు మంగళహారతులతో తిరు ఆభరణాలకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ఉత్సవ, అభివృద్ధి కమిటీ సభ్యులు, గురు స్వాములు, అర్చకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, జనవరి 14: నగరంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో మకరజ్యోతి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం, విశేషాభిషేకం, మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. మహా పాదయాత్ర బృందం నిర్వాహకుడు గడప నాగరాజు ఆధ్వర్యంలో 108 దీపాలతో దీపారాధన చేశారు. సాయంత్రం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీవీ ద్వారా అయ్యప్ప భక్తులు మకరజ్యోతిని వీక్షించారు. అనంతరం ఆలయ కమిటీతో పాటు గడప నాగరాజు నేతృత్వంలో పడిపూజ జరిపి అల్పాహారం ఏర్పాటు చేశారు. దీపకాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందగా అయ్యప్ప శరణుఘోష, భజనలతో ఆలయం మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో కొస్న కాంతారెడ్డి, అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య, దీక్షాపరులు పాల్గొన్నారు.