కమాన్చౌరస్తా/హుజూరాబాద్, అక్టోబర్ 13;‘సద్దుల’ సంబురం జిల్లాలో అంబరాన్నంటింది.. ‘పూల సింగిడి’ని తలపించింది.. బుధవారం ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలైంది.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా, ఊరారా జాతర సాగింది.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’ అంటూ మహిళలు పాటలతో హోరెత్తించగా వాడవాడా మారుమోగింది.. అనంతరం డ్యాంతోపాటు చెరువులు, కుంటలు, కాలువలు, ఘాట్ల వద్ద నిమజ్జనం చేసి, ‘పోయిరా గౌరమ్మా.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికింది.. ఆ తర్వాత వాయినాలు ఇచ్చుకుని, సంబురంగా ఇంటి దారి పట్టడంతో వేడుక ఘనంగా ముగిసింది..
సద్దుల సంబురాలు బుధవారం జిల్లాలో అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో ఓర్పుగా, అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం కొత్త బట్టలు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. సాయంత్రం కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హోరెత్తించారు. కరీంనగర్, హుజూరాబాద్తోపాటు పలుచోట్ల వందలాది మంది ఒక్కచోట చేరి ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటలు, కాలువలతోపాటు ఏర్పాటు చేసిన తెప్పల్లో నిమజ్జనం చేశారు. హుజూరాబాద్ పట్టణంలో మాజీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్-శ్వేత దంపతులు ఆడిపాడారు. పద్మాదేవేందర్రెడ్డి మహిళలను ఆత్మీయంగా పలుకరిస్తూ దాదాపు 3 గంటల సేపు వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల-శ్రీనివాస్, జడ్జీలు రాధిక, స్వాతి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్, కౌన్సిలర్లు కళ్లెపెల్లి రమాదేవి, ప్రతాప మంజుల, కేసీరెడ్డి లావణ్య పాల్గొన్నారు.