పేదల సంక్షేమ పథకాలపై చులకన భావం
పరిగె, భిక్ష అంటూ పలుచన మాటలు
ఇప్పుడేమో అందరికీ ఇవ్వాలని వ్యాఖ్యలు
లేదంటే తన వల్లే అన్నీ వస్తున్నాయని గొప్పలు
విస్తుపోతున్న హుజూరాబాద్ ప్రజలు
హుజూరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ..ఈ మాటలన్నీ మాట్లాడింది ఒక్కరే! అది ఎవరంటే బీజేపీ నేత ఈటల రాజేందర్! బడుగు బలహీన వర్గాలను భూములను కాజేశారనే ఆరోపణలతో పార్టీ మారిన ఈటల, పూటకో మాటతో ప్రజలను విస్తుపోయేలా చేస్తున్నారు. పేదల సంక్షేమం కోసం దేశంలోని ఎక్కడా లేని విధంగా సర్కారు పథకాలను అమలు చేస్తోంటే.. ఆయన మాత్రం తీరొక్క రకంగా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పేదల సంక్షేమం గురించి ఒక్క ఆలోచన చేయకుండా.. ఇప్పుడేమో వేదాలు వల్లిస్తున్నారు. ఆయన తీరును చూసి హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
పేదల సాధికారత కోసం తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఫలితంగా ఎంతో మంది జీవితాల్లో మార్పు కనిపిస్తున్నది. కానీ, బీజేపీ నేత ఈటల రాజేందర్కు మాత్రం ఇదంతా కనిపించ లేదు. తాను మంత్రిగా ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు పరిగె, భిక్ష అంటూ అవమానించారు. ఆసరా, కల్యాణలక్షి, షాదీ ముబారక్ దండగ అన్నారు. బీసీనని చెప్పుకునే ఆయన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం తరఫున అందే సాయాన్ని పెంచాలని కోరాల్సింది పోయి వాటిపై చులకనగా మాటాడారు. అధికారం అడ్డు పెట్టుకుని పేదల భూములను ఆక్రమించుకున్న ఈటల, పేదల కోసం ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచన చేయాల్సింది పోయి ఉన్న పథకాలే వృథా అన్నట్లుగా వ్యవహరించారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ నినాదంతో పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు ఎప్పుడూ విరుద్ధంగానే ఉండేవారు. ఆస్తులను కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్న తీరు హుజూరాబాద్ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నది. ఓ చోట ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలని డిమాండ్ చేస్తున్నారు. మరోచోట రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తన వల్లే జరుగుతోందని గొప్పులు చెప్పుకుంటున్నారు. పేదల సంక్షేమ పథకాలపై ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీలో చేరిన తర్వాత చెప్పిన మాటలను పరస్పరం విరుద్ధంగా ఉండడాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేస్తున్నారు. అధికారం కోసం, అధికారంతో వచ్చే ఆస్తుల కోసమే ఈటల రాజకీయం చేస్తారని, పేదల గురించి ఆయనకు పట్టదని అంటున్నారు.
రెండు నాల్కల పాట..
పేదల అవసరాలు ప్రాతిపదికన సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించారు. ఏడేండ్లుగా పక్కగా అమలు చేస్తున్నారు. ‘కల్యాణలక్ష్మి’, ‘ఆసరా’తో ఎక్కువ శాతం జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు లబ్ధి చేకూరుతున్నది. పేదవర్గాలకు ఆసరాగా అవుతున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈటలకు మాత్రం ఇదంతా నచ్చడం లేదు. అందుకే ఏడేండ్లలో ఏనాడూ బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడలేదు. బీసీనని చెప్పుకునే ఆయన, పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఒక్క చిన్న ప్రయత్నమూ చేయలేదు. ఏ వర్గం కోసమూ ఆలోచించలేదు. పైగా నిరుపేదల కడుపు నింపే, సామాజిక భద్రత కల్పించే సంక్షేమ పథకాలను పరిగె అని హేళన చేశారు. అధికార అండతో సొంత ఆస్తులు పెంచుకోవడం కోసమే ప్రయత్నించాడని హుజూరాబాద్లోని పేదలు వాపోతున్నారు. బలహీన వర్గాల కోసం ఏమీ చేయకపోగా, వారి జీవన భరోసా కోసం ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అక్రమంగా గుంజుకున్నారని గుర్తు చేస్తున్నారు. వ్యాపార వృద్ధి పేరిట ఎక్కడ పడితే అక్కడ పేదల భూములను అక్రమంగా సొంతం చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. పేదలకు ఉండాల్సిన ఒకటిరెండు ఎకరాలను దగ్గరపెట్టుకుని వందల ఎకరాలు పోగు చేసుకున్నాడని మండిపడుతున్నారు. సర్కారు హాస్టల్లో చదువుకున్నానని, దొడ్డు బియ్యం తిన్నానని చెప్పుకునే ఈటల, పేదలకు తిండి పెట్టే భూములు ఎంత అవసరమో గుర్తు లేకపోవడం విడ్డూరంగా ఉందని ఈటల సొంతూరు కమలాపూర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు సొంత లాభం మాత్రమే చూసుకుని, ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలో చేరిన రాజేందర్ ఇప్పుడేమో పేదలకు అన్ని ఇవ్వాలని, ఇంకా చేయాలని గంభీరపు ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని హుజూరాబాద్ ప్రజలు విస్తుపోతున్నారు. రోజుకోచోట రోజుకోతీరు మాట్లాడుతున్న ఆయనను చూసి విస్మయం చెందుతున్నారు.
అయ్యా ఈటల గారు..
మీకేంది సారు. మీకంటే వందల ఎకరాల భూమలుండె. మీ పంట పండుతది. మీ కడుపు నిండుతది. కనీసం గుంట లేనోళ్లకు ఆ పరిగెనే కడుపు నింపుతది. అవును సార్.. మీకున్న వేల కోట్లలో.. వందల కోట్లతో అంగరంగ వైభవంగా మీ బిడ్డల పెండ్లి చేస్తరు. మీకు కల్యాణలక్ష్మితో వచ్చే లక్ష రూపాయలు పది రూపాయలతో సమానం. కానీ, రెక్కాడితే డొక్కాడని పేదోడికి లక్ష రూపాయలంటే కోట్ల రూపాయలతో సమానం. మీ ఇంట్లో నౌకర్లకు ఇచ్చే జీతం కాకపోవచ్చు. కానీ, పేదోడికి మాత్రం ఒక బిడ్డకు పెండ్లి చేస్తే గుండెమీద భారం దింపుకున్నట్లే సారు. ఇక ఆసరా అంటరా.. మీకంటే కోళ్ల ఫారాలు.. వేల కోట్లు ఉన్నయ్.. ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు మీకు రెండు పైసలతోటి సమానం. కానీ, ఒక అవ్వకు నెల గడుస్తది. ఒక తాతకు మందులకు పనికొస్తాయి. పేదోడి కుటుంబంల సగం ఖర్సులకు అయితయి. మీరు ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండి ఇలా ఎలా మాట్లాడి న్రు? ఇది తప్పు కాదా మరి.. ఇంకా ఎందుకంటవ్ రాజేందరన్నా.. పదే పదే నాది ఆత్మా భిమానమని.. మరి సామాన్యుడిది ఆత్మాభిమానం కాదా..