గెలుస్తానని సంబురాలు చేసుకున్నవ్.. కార్పొరేటర్గా ఎలా ఉంటవ్?
నైతికత ఉంటే వెంటనే రాజీనామా చెయ్ మేయర్ సునీల్రావు
కార్పొరేషన్, డిసెంబర్ 11: రవీందర్సింగ్ ఎమ్మెల్సీగా గెలిస్తే రాజీనామా చేస్త. ఓడిపోతే నువ్వు కార్పొరేటర్ పదవిని వదులుకునేందుకు సిద్ధమా? అప్పుడే గెలుస్తానని సంబురాలు చేసుకున్నవ్. ఇంకా కార్పొరేటర్ పదవిలో ఎలా ఉంటవ్. పదవీ కాంక్షతోనే పార్టీ నుంచి వెళ్లిపోయినవ్. నీకు టీఆర్ఎస్ను, నాయకులను విమర్శించే అర్హత లేదు. నీకు నైతికత ఉంటే కార్పొరేటర్ పదవికి రాజీనామా చెయ్.
‘కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రవీందర్సింగ్ గెలిస్తే రాజీనామా చేస్తా..ఓడిపోతే నువ్వు కార్పొరేటర్ పదవిని వదులుకునేందుకు సిద్ధమా? నిజంగా నీకు గెలుపుపై విశ్వాసముంటే సంబురాలు చేసుకోవడం కాదు.. కారు గుర్తు ద్వారా వచ్చిన పదవికి రాజీనామా సమర్పించాలి’ అని కరీంనగర్ మేయర్ సునీల్రావు డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో పలువురు కార్పొరేటర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రవీందర్సింగ్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థినని ఒకసారి, స్వతంత్ర అభ్యర్థినని మరోసారి చెబుతూ అబద్ధాలతో ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడని నిప్పులు చెరిగారు. కేసీఆర్ నమ్మి మేయర్గా, కార్పొరేటర్గా అవకాశమిచ్చారని, కానీ పదవి కాంక్షతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేశారని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్వంద్వవైఖరిని అవలంబించిందని మండిపడ్డారు. ఓటుహక్కులేని ఈటల రవీందర్సింగ్కు మద్దతు ప్రకటించగా, ఓటున్న ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓటు వేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ నాయకులు గ్రూపు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులమంతా ఏకతాటిపై ఉండి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేశామని పేర్కొన్నారు. ఈటల, తుల ఉమ, రవీందర్సింగ్ పదవుల కోసమే పార్టీని వీడారని చెప్పారు. రవీందర్సింగ్ మున్సిపాలిటీకి చెందిన షెట్టర్ను 20 ఏళ్లుగా కిరాయికి ఇస్తూ అద్డె డబ్బులను సొంతానికి వాడుకుంటున్నాడని ఆరోపించారు. ఆయన నోట్ల కట్టలతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇండ్లకు వెళ్లి ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడని, అయినా కార్పొరేటర్లు లొంగకుండా ఏకతాటిపై నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేశారని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, గంట కళ్యాణీ శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, యాదయ్య, ఐలేందర్యాదవ్, మాధవి, జయశ్రీ, సరిళ్ల ప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు అజిత్రావు, టీఆర్ఎస్ నాయకులు సుధగోని కృష్ణగౌడ్, చంద్రమౌళి, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.