ఓదెల, అక్టోబర్ 11:జిల్లాకు చెందిన పలువురు యువ రైతులు ఈ సీజన్లో డిమాండ్ ఉండే పూల తోటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మూస పద్ధతిలో ఎప్పుడూ వేసే వరి, మక్కజొన్నకు బదులుగా పూల పెంపకాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల వేళ గిరాకీ ఎక్కువగా ఉండే బంతిపూల తోటలు పెంచుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, రామగిరి, కమాన్పూర్, మంథని, ముత్తారం, పెద్దపల్లి, పాలకుర్తి మండలాల్లోని తీరొక్క రకాలను వేశారు. ఓదెలకు చెందిన యువ రైతు బోడకుంట అనిల్ ఇంటర్, ఐటీఐ వరకు చదివాడు. తనకున్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరంలో బంతిపూల తోట, 30 గుంటల్లో తిండిగింజల కోసం వరి, మిగిలిన భూమిలో కాకర, బీర వంటి కూరగాయలు వేశాడు. బంతిపూల తోటను ఆగస్టు 5న సాగు చేయగా, 60 రోజుల్లో పూలు చేతికి వస్తున్నట్లు తెలిపాడు. రూ.50వేల పెట్టుబడి కాగా, మూడింతల లాభం రూ.1.50 లక్షలు వస్తుందని చెబుతున్నాడు. ప్రస్తుతం బంతిపూలు మార్కెట్లో కిలో రూ.100 నుంచి 120 వరకు ధర పలుకుతుంది. రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా ‘లక్కీ’ బంతి పూల రకం సీడ్ తీసుకువచ్చి సాగు చేసినట్లు పేర్కొంటున్నాడు. ఆశించిన కాత రావడం సంతోషంగా ఉందన్నారు. తామే నేరుగా మార్కెట్లో పూలను అమ్మడం వల్ల అధిక లాభాలు రానున్నట్లు చెప్పారు.
బంతి పూల సాగు ఇలా..
పూల తోటల సాగు, సస్యరక్షణ చర్యలపై పెద్దపల్లి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ మొదటి నుంచి అక్టోబర్ మొదటి వారంలోగా నారు వేయాలి. నీరు త్వరగా ఇంకిపోయే ఎర్ర, బంకమట్టి నేలలు అనుకూలం. నాటుకు ముందు పాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదల నుంచి రక్షించుకోవచ్చు. ఎకరానికి ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువులతో పాటు 4 కిలోల అజోస్పైరిల్లమ్, 4కిలోల ఫాస్పో బాక్టీరియాలను వేసి కలియదున్నాలి. నాటిన 55-60 రోజుల వరకు పూత దశలోనూ నేలలో తేమ ఉండేలా చూడాలి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. పూలను ఎప్పటికప్పుడు కోయడం వలన దిగుబడి పెరుగుతుంది. పూలను కోసి తర్వాత తడిపి గోనె సంచి లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డను కప్పి మార్కెట్కు తరలించాలి.