జగిత్యాల, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, ధర్మపురిలో సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నది. తలాపునే గోదావరి పారుతున్నా చుక్కనీరు వాడుకోలేని దైన్యంలో ఉన్న నియోజకవర్గంలో నది పరీవాహక గ్రామాల ప్రజల కలను నెరవేర్చింది. ఒకటి కాదు రెండు కాదు ధర్మపురి, వెల్గటూర్ మండలాల పరిధిలో గోదావరి నదిపై రూ.247.86 కోట్లతో 11 ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నది. ఇందులో ఇప్పటికే 7 లిఫ్టులు పూర్తి చేసి, కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తుండగా, తడారిన భూములకు జీవం వస్తున్నది. తమ పొలాల్లో పారుతున్న నీళ్లను చూసి రైతాంగం పరవశించిపోతున్నది. ఏండ్ల కాలంగా అనుభవిస్తున్న వెతలు తీరడంతో మంత్రి ఈశ్వర్, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నది.
గోదావరి నీళ్లు తమ పొలాల్లోకి చేరుతుంటే ధర్మపురి, వెల్గటూర్ మండలాల పరిధిలోని నదీ పరీవాహక గ్రామాల రైతులు మురిసిపోతున్నారు. ‘తలాపునే గోదావరి.. తన పంట ఎడారి’ అంటూ దశాబ్దాల పాటు తల్లడిల్లిన కర్షకులు ఎత్తిపోతల ద్వారా తరలివస్తున్న నీటితో పంటలు పండించుకుంటూ సంబురపడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు వందలాది కోట్లు వెచ్చించి, 11 ఎత్తిపోతల పథకాలు నిర్మించుకొని, కిలోమీటర్ల పొడవునా పైప్లైన్లు వేసి నీటిని తమ పొలాల్లోకి మళ్లిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.
స్వరాష్ట్రంలో జీవం..
స్వరాష్ట్ర సాధన అనంతరం గోదావరి పరీవాహక గ్రా మాల దశ మారింది. 2009 నుంచి ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మంత్రి కొప్పు ల ఈశ్వర్, 2009 నుంచి రైతులకు నీరందించే మార్గాలపై అన్వేషించారు. పలుమార్లు ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ అధికారులు, అప్పటి మంత్రులను కలిసి ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని విన్నవించి నా కార్యరూపం దాల్చలేదు. స్వరాష్ట్రం సిద్దించిన తర్వా త చీఫ్ విప్గా బాధ్యతలు స్వీకరించిన కొప్పుల, నిధుల మంజూరు కోసం ప్రయత్నించి విజయవంతమయ్యారు.
11 ఎత్తిపోతల పథకాలు..247.86 కోట్లు
ధర్మపురి నియోజకవర్గంలోని గోదావరి పరీవాహక మండలాలైన ధర్మపురి, వెల్గటూర్ మండలాల్లో మొత్తం 11 ఎత్తిపోతల పథకాలను అధికారులు ప్రపోజ్ చేశారు. వీటికి రూ.247.86 కోట్ల వ్యయం అవుతుందని అంచ నా వేయగా, ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ధర్మపురి మండలంలో తొమ్మిది, వెల్గటూర్ మండలం లో మూడు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. ధర్మపురి మండలంలో దొంతాపూర్లో రూ.18.24 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా 1824 ఎకరాల సాగు భూమికి నీరందుతున్నది. అయి తే ఈ ఎత్తిపోతల పథకానికి మరో పైప్లైన్ వేస్తే మరో 400 ఎకరాలకు సాగునీరు అందుతుందన్న అధికారుల సలహా నేపథ్యంలో ఈ పైప్లైన్కు రూ.8.91 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పని ప్రగతిలో ఉంది. ఎడపల్లిలో రూ.9.27 కోట్లతో లిఫ్ట్ నిర్మించగా, 1200 ఎకరాలకు నీరందుతున్నది. ఇక జైనలె రూ.10.89 కోట్లతో చేపట్టిన లిఫ్ట్తో వెయ్యి ఎకరాల భూమికి డోకా లేకుండా పోయింది.
రాజారంలో రూ.10 కోట్లతో నిర్మించిన పథకం వెయ్యి ఎకరాలకు సాగునీటిని అందజేస్తున్నది. దమ్మన్నపేటలో రూ.18.90 కోట్లతో నిర్మించిన పథకంతో 1550 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. తిమ్మాపూర్లో 2200 ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు రూ.19.20 కోట్లతో పథకాన్ని పూర్తి చేశారు. రాయపట్నంలో 1200 ఎకరాల భూమికి నీరందించేందుకు రూ.10 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. కాగా, అక్కపెల్లిలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. 4,377 ఎకరాల భూమికి నీరందించేందుకు ఉద్దేశించిన ఈ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూ.60.89 కోట్లు కేటాయించింది. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇక వెల్గటూర్ మండల మండలం ముత్తునూర్లో 2300 ఎకరాల భూమికి నీరందించేందుకు రూ.14.35 కోట్లతో ఎత్తిపోతల పథకం పూర్తయింది. స్తంభంపెల్లిలో 3585 ఎకరాలకు నీరందించేందుకు రూ.35.63 కోట్లు మంజూరయ్యాయి. ఇక వెల్గటూర్ మండల కేంద్రానికి సంబంధించి 1757 ఎకరాల భూమికి నీరు అందించేందుకు రూ.29.64 కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభమై చివరిదశకు చేరుకున్నాయి. మొత్తంగా రెండు మండలాల పరిధిలో 11 గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు చేపట్టి 22,393 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 13వేల ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా అందుతోంది. మిగిలిన ఐదు పథకాలు సైతం త్వరలోనే పూర్తి కానున్నాయి.
రైతుల పాలిట వరం..
ధర్మపురి, ధర్మపురి మండలంలో గోదావరి ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకాలు రైతుల పాలిట వరంగా మారాయి. ఇవి నిర్మించకముందు పొలాలు బీళ్లుగా ఉండి రైతులకు కన్నీళ్లే మిగిల్చేవి. కానీ ఇప్పుడు వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. అయితే గతేడాది గోదావరి వరదలు వచ్చినపుడు ఎత్తిపోతలు దెబ్బతిన్నాయి. మంత్రి ఈశ్వర్ వెంటనే స్పందించి ఎడపెల్లి, జైన, రాజారం, రాయపట్నం, తిమ్మాపూర్, ఆరెపల్లి ఎత్తిపోతల మరమ్మతు పనులకు రూ.3.76కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు నడుస్తున్నాయి. మా రాజారం ఎత్తిపోతల పథకం నుంచి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేసి కాలువ ద్వారా గ్రామంలోని అత్తెకుంట, కొత్తకుంట, ఎండపెల్లి కుంట చెరువులను నింపుకుంటున్నం. రెండు పంటలకు సాగునీటికి ఢోకా లేకుండా ఉంది.
– సౌళ్ల భీమయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్, ధర్మపురి
సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలిగినయ్..
ధర్మపురి, జైన ఎత్తిపోతల పథకం వల్ల జైన గ్రామానికి సాగు, తాగు నీటి ఇబ్బందులు తొలిగిపోయాయి. బీర్పూర్ రోళ్లవాగుకు చివరి ఆయకట్టు గ్రామంగా జైన ఉండడం వల్ల గతంలో కాలువ ద్వారా నీరందేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం గోదావరి ఒడ్డున రూ.1.89 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించడంతో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా సాగునీరందుతున్నది. ఎత్తిపోతల ద్వారా ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి వేసవిలో గ్రామశివారులోని ఊరచెరువు, చింతల చెరువు, రాయకుంట, వెంకటమ్మ చెరువులు నింపుకుంటున్నం. ఊర చెరువు పక్కనే రక్షిత మంచినీటి సరాఫరా బావిని తవ్వుకున్నం. చెరువులో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల బావిలో ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీరుంటున్నది.
– కుడిక్యాల మహేశ్, సర్పంచ్, జైన గ్రామం