కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ఎగవేత మిల్లర్లపై అధికారులు సీరియస్గా ఉన్నారా..? డిఫాల్టర్లపై చర్యలకు రంగం సిద్ధం చేశారా..? రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగం చేయనున్నారా..? మిల్లర్ల ఆస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. తాజాగా, సివిల్ సైప్లె అధికారులు తహసీల్దార్లకు డిఫాల్టర్ మిల్లర్ల వివరాలను పంపించి, మిల్లర్లతో మాట్లాడి నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా, వారికి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించి, పంపించాలని సూచించినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం జమ్మికుంట తహసీల్దార్ వెంకట్రెడ్డి రైస్ మిల్లర్ల సంఘం సభ్యులను పిలిపించి, డిఫాల్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
జమ్మికుంట, మార్చి 30: కరీంనగర్ జిల్లాలోని సివిల్ సైప్లె అధికారులు రూ.వందల కోట్లు బకాయి ఉన్న మిల్లర్ల లిస్టు తయారు చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు సీఎమ్మార్ బియ్యాన్ని అందించకుండా 109 మిల్లులు (కొందరు బకాయిలు చెల్లించామని చెబుతున్నారు) ఉన్నట్టు ధ్రువీకరించారు. ఆస్తుల లిస్టు తయారు చేసి నివేదిక అందించాలని జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు సంబంధింత లిస్టులను పంపించారు. అలాగే కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్) యాక్టు ప్రయోగానికి ఆదేశాలిచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలను బకాయిలు పడిన మిల్లర్ల మండలాల్లోని తహసీల్దార్లకు అందించారు.
ఈ చట్టం మిల్లర్ల స్థిర, చరాస్తులను వేలం వేసి బకాయిలు రాబట్టుకునేలా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే.. తహసీల్దార్లు బకాయిలు పడ్డ ఆయా మిల్లర్లకు సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. ఆర్ఆర్ చట్టం వివరాలను తెలియజేసినట్టు వినికిడి. కాగా, అందులో ఏళ్లకాలంగా డిఫాల్టర్లుగా ఉన్న మిల్లర్లు కొందరు వ్యాపారం చేయడం లేదు. మరి కొందరు చనిపోయారు. ఇంకొందరు ‘కేసులు పెట్టుకోండి చూద్దాం’ అనే తరహాలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే గతంలో కేసులు నమోదైన మిల్లర్లు జైలుకు వెళ్లారు. వ్యాపారాలకు దూరంగా ఉన్న మిల్లర్లు ఎంతో మంది తమ ఆస్తులను అమ్ముకున్నారు. ఇప్పుడు తమ వద్ద ఏమీ లేదని చేతులెత్తేస్తున్న పరిస్థితులున్నాయి. కొందరు మిల్లర్లు కోట్లాది రూపాయల బకాయిలుండగా.. వారికి సంబంధించిన ఆస్తులు రికవరీకి సరిపోవడం లేదని తెలుస్తున్నది. ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి సీఎస్ అధికారులకు పంపించేందుకు తహసీల్దార్లు నివేదికలు తయారు చేస్తున్నారు.