అన్నట్లుగానే రైతు వేదికలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సుమారు 18 నెలల కింద ప్రారంభించిన ఈ వేదికల నిర్వహణకు ఒక్కోదానికి 9 వేల చొప్పున అందిస్తామని చెప్పింది. అయితే కరోనా కారణంగా నిధుల కేటాయింపు విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు 45 వేల చొప్పున ఉమ్మడి జిల్లాలోని 258 వేదికలకు మొత్తం కోటీ 16 లక్షల 10 వేలను విడుదల చేసింది. ఇవి ఇప్పటికే ఏఈవోల ఖాతాల్లో జమచేయగా, ఆర్బీఎస్ కమిటీల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రైతులను సంఘటితం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు సమితులను ఏర్పా టు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరి 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఐదు వేల హెక్టార్లకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పటికే ఉద్యోగాల్లో చేరిన వ్యవసాయ విస్తరణ అధికారులను ఈ క్లస్టర్లకు అధికారులుగా నియమిస్తామని ప్రకటించారు. అంతే కాకుండా, ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22 లక్షలు అంచనా వేశారు. అనేక వేదికలకు దాతలు స్థలాలు ఇచ్చారు. కొందరు సొంత ఖర్చులతో నిర్మించారు. ఇలా 2020-21లో రైతు వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటి నిర్వహణ కోసం నెలకు రూ.9 వేలు అందించాలని ప్రభు త్వం నిర్ణయించింది. కరోనా కారణంగా నిధుల కేటాయింపులో కొంత జాప్యం జరిగినా, అప్పుడు అన్నట్లుగానే ప్రస్తుతం ఐదు నెలల నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగానే రైతు వేదికలు రైతన్నకు సేవలందిస్తున్నాయి. రైతులకు సమాచార కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రతి సీజన్లో శిక్షణ కార్యక్రమాలను రైతు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నరగా ఇప్పటికే పలు రకాల సేవలను ఈ వేదికల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్నారు. అంతే కాకుం డా, వ్యవసాయ విస్తరణ అధికారులకు కూడా ఈ వేదికలే కార్యాలయాలుగా మారాయి. మండల, డివిజన్ వ్యవసాయ అధికారులు లేనిచోట వీటిని ప్రధాన కార్యాలయాలుగా కూడా వినియోగించుకుంటున్నారు.
క్లస్టర్ పరిధిలో రైతులు ఎలాంటి పంటలు వేయాలి, నేలల స్వభావాన్ని బట్టి ఎలాంటి పంటలు వేసుకుంటే మంచి దిగుబడు లు సాధించవచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ముఖ్యంగా రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలపై ఈ వేదికల్లో రైతులకు సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటున్నది. వాతావరణ సూచనలు కూడా ఈ వేదికల ద్వారా రైతులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమంలా చేపట్టిన ఆయిల్పామ్ విస్తరణ కార్యక్రమానికి ఈ వేదికలకు ఆలంబనగా మారాయి. ఇలాంటి వేదికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా, నిధులు మంజూరు చేయడంతో రైతుబంధు సమితుల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు వేదికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిధులు మంజూరు చేసింది. ఒక్కో దానికి రూ.45 వేల చొప్పున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 258 రైతు వేదికలకు రూ.కోటి 16 లక్షలా 10 వేలను మంజూరు చేసింది. వీటిని విద్యుత్తు బిల్లులు, క్లీనింగ్ చార్జీలు, ఇతర అవసరాలకు ఖర్చు చేయాలని ఆయన సూచిస్తున్నారు.
చిగురుమామిడి పరిధిలోని 6 వేదికలకు రూ. 2.70 లక్షలు, చొప్పదండి పరిధిలోని 5 వేదికలకు రూ.2.25 లక్షలు, ఇల్లందకుంట పరిధిలోని 4 వేదికలకు రూ.1.80 లక్షలు, గంగాధర మండలంలోని 5 వేదికలకు రూ.2.25 లక్షలు గన్నేరువరంలోని 4 వేదికలకు రూ.1.80 లక్షలు, హుజూరాబాద్ పరిధిలోని 5 వేదికలకు రూ.2.25 లక్షలు, జమ్మికుంట పరిధిలోని 5 వేదికలకు రూ.2.25 లక్షలు, కరీంనగర్ రూరల్ పరిధిలోని 4 వేదికలకు రూ.1.80 లక్షలు, కొత్తపల్లి పరిధిలోని 3 వేదికలకు రూ.1.35 లక్షలు, మానకొండూర్ పరిధిలోని 7 వేదికలకు రూ.3.15 లక్షలు, రామడుగు పరిధిలోని 6 వేదికలకు రూ.2.70 లక్షలు, శంకరపట్నం పరిధిలోని 6 వేదికలకు రూ.2.70 లక్ష లు, తిమ్మాపూర్ పరిధిలోని 5 వేదికలకు రూ. 2.25 లక్షలు, సైదాపూర్ పరిధిలోని 6 వేదికలకు రూ. 2.70 లక్షలు, వీణవంక పరిధిలోని 5 వేదికలకు రూ.2.25 లక్షలు నిర్వహణ ఖర్చులు విడు దల చేశారు.
రైతు వేదికలు నిర్మించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా విడుదల చేసిన నిర్వహణ ఖర్చులు ఇవి. వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ మొత్తాన్ని అందిస్తాం. విద్యుత్తు బిల్లులు, క్లీనింగ్ చార్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాం. ఇతర ఖర్చులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. రైతులకు అనేక రకాల సేవలు అందిస్తున్న వేదికలను మరింత పటిష్టంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఈ నిధులను విడుదల చేసింది. రానున్న కాలంలో రైతు వేదికల ద్వారా మరిన్ని సేవలు విస్తరించే అవకాశం లేక పోలేదు.
– వాసిరెడ్డి శ్రీధర్ డీఏవో, కరీంనగర్