హుజురాబాద్టౌన్, డిసెంబర్ 8: పట్టణ పరిశుభ్రతలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఫ్లెక్సీల నిషేధంపై మెప్మా ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ -2022కు అందరూ సిద్ధం కావాలన్నారు. పరిశుభ్రమైన పట్టణంగా హుజూరాబాద్ను నిలుపాలని కోరారు. ఈ నెల 15లోపు 15శాతం ఇళ్లలో కంపోస్టు ఎరువు తయారు చేసేలా అవసరమైన శిక్షణ ఇస్తారన్నారు. పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు ఇస్తామని చెప్పారు. కార్మికులందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. పారుల నిర్వహణ, పరిశుభ్రతలో వివిధ వర్గాలను భాగస్వామ్యం చేయడం, వివాహాలు, శుభకార్యాల్లో వ్యర్ధాలు లేకుండా చూడడం, స్వచ్ఛ అవార్డుల కోసం వార్డుల గుర్తింపు, పారిశుధ్య నిర్వహణలో వినూత్న విధానాలను గుర్తించడం వంటి కార్యక్రమాలపై ఉద్యోగులు, సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఎవరైనా మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం పాటించకపోయినా, క్యారీ బ్యాగులు వాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి
పట్టణంలోప్లాస్టిక్ వాడకంపై మెప్మా సభ్యులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని హుజూరాబాద్ బల్దియా కమిషనర్ సీహెచ్ వెంకన్న సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో భాగంగా హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని మెప్మా సిబ్బందితో స్థానిక సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదని, బట్ట సంచులను మాత్రమే వాడాలని, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని ఆర్పీలు, సీఏలకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ హెల్త్ విభాగం ఇన్చార్జి ఎం రాజు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ వినయ్, శానిటరీ జవాన్లు ప్రతాపరాజు, రమేశ్, అనిల్కుమార్, మెప్మా ఆర్పీలు రమాదేవి, స్వరూప, అనూష, సీఏలు, పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.