పెద్దపల్లి, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి వీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి, మంథని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ ఎన్నికల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 264 ఓటర్లు ఉండగా మంథని నియోజక వర్గం పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన 42 మందితో మొత్తం 306 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దపల్లి, మంథని ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అట్లాగే పోలింగ్ స్టేషన్కు సమీపంలో హెల్క్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. పెద్దపల్లి పోలింగ్ కేంద్రంలో 208, మంథని పోలింగ్ 98 మంది ఓటర్లు ఉండగా ఇందులో మంథని నియోజక వర్గం పరిధిలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు చెందిన 42 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. పెద్దపల్లి పోలింగ్ కేంద్రంలో 94 మంది పురుష, 114 మంది మహిళా ఓటర్లు, మంథని పోలింగ్ కేంద్రంలో 39 మంది పురుష, 59 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎన్నికల కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భాతిక దూరాన్ని పాటించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలన్నారు. ఈనెల 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుతుందన్నారు. ఓటర్లు ఏదేని ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, మంథని ఆర్డీవో కే నరసింహమూర్తి, పెద్దపల్లి తహసీల్దార్ దుర్శేటి శ్రీనివాస్, మంథని తహసీల్దార్ బండి ప్రకాశ్, ఎన్నికల డీటీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.