కార్పొరేషన్/కమాన్ చౌరస్తా, డిసెంబర్ 8: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రీమెట్రిక్ సాలర్షిప్ల కోసం ప్రధానోపాధ్యాయులు ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసి సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఫాంలు అందజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం విద్యార్థులకు ప్రీ మెట్రిక్ సాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసే విధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రీ మెట్రిక్ సాలర్ షిప్ల కోసం 6,240 మంది అర్హులు ఉన్నారని, ఇప్పటి వరకు 336 మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మిగితా విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని, సంబంధిత దరఖాస్తు ఫాంలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అందజేయాలని ఆదేశించారు. విద్యార్థుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే మూడు రోజుల్లోగా జారీ చేయాలని డిప్యూటీ తహసీల్దార్లకు సూచించారు. ఉపకార వేతనాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఏమైన సమస్యలుంటే వెంటనే హెల్ప్ డెస్ నంబర్ 96766 11730ను కార్యాలయ పని వేళలో సంప్రదించాలన్నారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకుడు నతానియల్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏఎస్డబ్ల్యూవోలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.