చొప్పదండి, డిసెంబర్ 8: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలని మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ రైతులకు సూచించారు. మండలంలోని రుక్మాపూర్, కాట్నపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో వంశీకృష్ణ మాట్లాడుతూ, యాసంగిలో మినుము, పెసర, నువ్వులు, వేరుశనగ లాంటి పంటలు సాగు చేయాలని సూచించారు. అనంతరం చొప్పదండికి చెందిన కుందెల లక్ష్మీనారాయణ సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. మిగతా రైతులు లక్ష్మీనారాయణను ఆదర్శంగా తీసుకొని ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు.
గంగాధర, డిసెంబర్ 8: మండలంలోని వెంకటాయపల్లిలో ఆత్మ పీడీ ప్రియదర్శిని ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలైన నూనె గింజలు, పప్పు దినుసులు, కూరగాయలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పంట మార్పిడి చేయడంతో భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమల్ల మేఘరాజు, ఉపసర్పంచ్ వేముల శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి కర్ర ఉదయశ్రీ, ఏటీఎం స్రవంతి, రైతులు పాల్గొన్నారు.
రామడుగు, డిసెంబర్ 8: మండలంలోని పందికుంటపల్లి, వెలిచాల, తదితర గ్రామాల్లో యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై మండల వ్యవసాయాధికారి యాస్మిన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. వరికి బదులు ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. పందికుంటపల్లిలో ఏవో యాస్మిన్ మాట్లాడుతూ, ఒకే రకం పంటను ఏళ్ల తరబడి సాగు చేయడంతో భూమి సారాన్ని కోల్పోతుందన్నారు. భవిష్యత్లో ఏవిధమైన పంటలను సాగు చేయడానికి వీలు లేకుండా ఉంటుందన్నారు. యాసంగిలో ఆరుతడి పంటలైన శనగ, వేరుశనగ, మినుములు, పెసర, నువ్వులు, తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. ముందస్తుగా మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న వారు మాత్రమే వరి సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో గోవర్ధన్, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.