ఆదిలాబాద్ రైతుల స్ఫూర్తితో ముందుకు
పదెకరాల్లో పంటకు శ్రీకారం
పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ
జూలపల్లి, డిసెంబర్ 8;పంటమార్పిడికి జూలపల్లి రైతులు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి లాభదాయక సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఏండ్ల తరబడి వేసిందే వేసి నష్టాల బాట పట్టి విసుగు చెంది ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదిలాబాద్ రైతుల అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని గోధుమ సాగుకు సమాయత్తమయ్యారు. పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ వస్తుండడంతో తొలుత ఆరుగురు రైతులు లాభనష్టాలను అంచనా వేసేందుకు పదెకరాల్లో ప్రయోగాత్మకంగా సేద్యం మొదలుపెట్టారు.వీరి బాటలో మరికొందరు కూడా పంట మార్పిడికి సై అంటున్నారు.
రైతులు సంప్రదాయ పంటలకు క్రమంగా స్వస్తి పలుకుతున్నారు. ఏండ్ల తరబడి రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట సాగు చేస్తూ నష్టాలు మూటగట్టుకుంటున్నారు. దీనికి భిన్నంగా కొంత మంది రైతులు కొత్త పంటలు సాగు చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వినూత్న రీతిలో సాగు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఇతర పంటలు వేసేందుకు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో లాభాల బాట పట్టడానికి వరి రైతులు పంట మార్పిడికి సై అంటున్నారు. ఏండ్ల తరబడి వరి సాగు చేసిన రైతులు గోధుమ పంటపై ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గోధుమ పండిస్తున్న రైతుల ద్వారా అనుభవాలు స్వయంగా తెలుసుకొని సేద్యం పనులు మొదలు పెట్టారు. జూలపల్లి మండలంలో ప్రధానంగా వరి, పత్తి, మొక్క జొన్నలతోపాటు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. తొలుత పంట సాగు చేసి లాభనష్టాలను అంచనా వేసేందుకు ఆరుగురు రైతులు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా గోధుమ సాగుకు శ్రీకారం చుట్టారు. జూలపల్లి, పెద్దాపూర్, వడ్కాపూర్ శివారులో సాగు చేస్తున్నారు. ఈ నెల 7న జూలపల్లి గ్రామానికి చెందిన రైతులు సిరికొండ కొమురయ్య, పాటకుల గట్టయ్య, గుమ్మడి తిరుపతి, మారం రాజు, పొట్టాల శ్రీనివాస్, ఆరెపెల్లి మల్లేశం కలిసి సొంత ఖర్చులతో ఓ ప్రైవేట్ వాహనం సమకూర్చుకుని ఆదిలాబాద్ జిల్లాకువెళ్లి గోధమ పంట క్షేత్రాలను పరిశీలించారు. తలమడుగు మండలం ఉండం, హర్లీ గ్రామాల్లో పర్యటించి అక్కడి గోధుమ పంట సాగు విధానంపై రైతుల నుంచి అనుభవాలు తెలుసుకున్నారు. చలి తీవ్రత ఎక్కువగా, నల్ల రేగడి భూములు గోధుమ పంటకు అనుకూలంగా ఉంటాయని అక్కడి రైతులు పేర్కొన్నారు. ఇక్కడ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆదిలాబాద్లో ‘నూజివీడు’ కంపెనీకి చెందిన ఎన్ఎన్ఎస్ 45 రుచి విత్తనాలు కొనుగోలు చేశారు. 25 కిలోల విత్తనాలను రూ. 1500కు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం విస్తీర్ణంలో దాదాపు 25 కిలోల విత్తనాలు వేయాలని అక్కడి రైతులు తెలిపారు. దీంతో రైతులు దుక్కిదున్ని విత్తనాలు చల్లి తుంపర్ల పద్ధతిన నేలను తడిపారు. విత్తనాలు మొలకెత్తేందుకు తుంపర్ల విధానాన్ని ఎంచుకున్నారు. ఒకసారి అడుగు మందు చల్లి విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఎకరానికి యూరియా బస్తా వినియోగిస్తామని వెల్లడించారు.
వరి పంట కంటే నయం
గోధుమ సాగు వరి కంటే నయమే. నారు అలుకుడు, వరి నాట్లు వేయడం తప్పుతుంది. కూలీల బాధ ఉండదు. కిలో గోధుమలకు క్వింటాలు దిగుబడి వస్తుందని ఆదిలాబాద్ జిల్లా రైతుల ద్వారా తెలుసుకున్నాం. గోధుమ పంటకు నల్ల రేగడి భూములు అనుకూలం. గోధుమ పంటలో కలుపు ఎక్కువగా ఉండదు. పంటను ఆశించే చీడ పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అధిక పంట దిగుబడులు ఆశించవచ్చు. దాదాపు ఎకరానికి రూ. 45 వేల ఆదాయం రావచ్చు.