ధర్మారం, నవంబర్ 8: ధర్మారం మండలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను గడువులోగా పూర్తి చేయించాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, నీటి పారుదల, ఎస్సీ సంక్షేమ, వ్యవసాయ, ఫారెస్ట్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, విద్య, సెర్ప్, ఉపాధిహామీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. డీఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్ పథకాల కింద మంజూరై టెండర్లయిన పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ధర్మారంలో 4 లేన్ల బీటీ విస్తరణ రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం కోసం సిద్ధం చేయాని సూచించారు. పోడు భూముల లబ్ధిదారుల జాబితాను అందించాలని సూచించారు. మండలంలో ఎస్సీ భూముల చదును కోసం రైతుల జాబితాను తయారు చేయాలన్నారు. ఎస్సీలకు స్వయం ఉపాధి కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపాలని, ఆయిల్ పామ్ తోటల సాగుకు ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో డీపీవో చంద్రమౌళి, ఆర్డీవో శంకర్ కుమార్, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ వెంకట లక్ష్మి, పీఆర్ ఈఈ మునిరాజ్, అధికారులు పాల్గొన్నారు.
ప్రొసీడింగ్స్ అందజేత
ధర్మారంలో పద్మశాలీ భవన నిర్మాణానికి రూ.10 లక్షల ప్రొసీడింగ్ ప్రతిని సంఘం అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా కృతజ్ఞతగా వారు మంత్రిని సత్కరించారు. ధర్మారంలో యోగా భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని మంత్రి ఈశ్వర్కు యోగా గురూజి జంగిలి సుధాకర్, యోగా సభ్యులు వినతి పత్రం అందజేయగా, అవసరమైన స్థలం కేటాయించడానికి రెవెన్యూ అధికారులను ఆదేశిస్తానని అభయమిచ్చారు. ధర్మారంలో పలువురు బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు.