స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంక్షేమమే లక్ష్యం
ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు.. సూచనలు
సమయం వచ్చినప్పుడల్లా గళం
సాక్ష్యంగా అసెంబ్లీ రికార్డులు
ఓటమి భయంతో ప్రతిపక్షాల విమర్శలు
దమ్ముంటే రికార్డులు పరిశీలించాలంటున్న టీఆర్ఎస్ నేతలు
కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీ భానుప్రసాద్రావు రెండు సార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేశారు. తన పదవీ కాలంలో అన్ని కేటగిరీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సాక్షిగా తనకు కలిసి వచ్చిన సమయంలో.. తనదైన శైలిలో తన వాణి వినిపించారు. పలుసార్లు రాతపూర్వకంగా వివిధ మంత్రులకు విజ్ఞప్తులు చేశారు. గతంలో అనేకసార్లు మాట్లాడినప్పటికీ, తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 27న తనదైన శైలిలో సభలో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. స్థానిక సంస్థల పాలనలో ఐదంచెల వ్యవస్థ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్తులకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చే పరిస్థితి ఏర్పడినప్పటి నుంచి మండల, జిల్లా పరిషత్తులు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్తులకు వాళ్ల విధులు, నిధులు ఏమిటనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పూర్తిస్థాయిలో ఎన్నికై కుర్చీలో కూర్చున్నప్పటికీ.. వారెందుకు ఎన్నికయ్యారో..? వారి విధులేమిటో..? తెలియని పరిస్థితి ఉంది. గతంలో జిల్లా మంత్రికి ఎంత పవర్ ఉండేదో, జిల్లా చైర్మన్లు కూడా అంతే పటిష్టమైన, బలమైన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ వ్యవస్థను పునర్నిర్మించే దిశగా, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జడ్పీ పాఠశాలలు కూడా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నడిపించే విధంగా ప్రయత్నించి ప్రతిపాదనలు చేశారు. జడ్పీలకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ నుంచి మంజూరైన రూ.500 కోట్లకు అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక రూ.300 కోట్లు కేటాయించింది. జడ్పీలు, మండలాల ద్వారా దానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. త్వరితగతిన వాటిని ఆమోదించి అది అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి అదే రోజు మంత్రి సమాధానం సైతం ఇచ్చారు. వీటికి ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచుల వేతనాల పెంపు కోసం తనే లీడ్ తీసుకొని ప్రయత్నించారు. రాత పూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతేకాదు, వేతనాలు పెంచిన తర్వాత తమ వినతికి సంబంధించి, ఆమోదించిన వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. ఇది అసెంబ్లీ సాక్షిగా రికార్డు ఉంది. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ, జడ్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో కమిటీలు నియమించాలని, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు ట్రావెలింగ్ అలవెన్స్లు, మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, ఉపాధిహామీ నిధుల వినియోగంలో జిల్లా, మండల పరిషత్లకు భాగస్వామ్యం కల్పించాలని, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల పరిధిలో పంద్రాగస్టు కార్యక్రమం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో నిర్వహించాలని, విధులపై శిక్షణ ఇవ్వాలని, ఎంపీటీసీ జడ్పీటీసీలకు ప్రొటోకాల్ కల్పించాలని, పల్లె ప్రగతి పర్యవేక్షణలో సర్పంచులతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలను కమిటీలో సభ్యులుగా చేర్చాలని కోరారు. ఇంకా సమయం వచ్చినప్పుడల్లా అసెంబ్లీ సాక్షిగా ఆయన గళం విప్పారు. స్థానిక సంస్థల సమస్యలను దృష్టికి తెస్తూ పరిష్కరింపజేసే ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ అసెంబ్లీ రికార్డులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
లేనిపోని ఆరోపణలు..
భాను ప్రసాద్రావు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏనాడూ అసెంబ్లీ వేదికగా మాట్లాడలేదని, శానన మండలిలో నోరు విప్పలేదంటూ ఇటీవల కొంత మంది ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో..? ఎవరెవరు ఏమి మాట్లాడుతున్నారో..? వినే జ్ఞానం లేని వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అసెంబ్లీ వేదికగా చేసే ప్రతి ప్రసంగం రికార్డుల్లోకి ఎక్కుతుంది. అవసరమున్న వారు తీసుకోవడానికి ఆస్కారముటుంది. ఆమాత్రం అవగాహన లేకుండా కొంత మంది మాట్లాడుతున్నారు. నిజానికి భాను ప్రసాద్రావు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని చెప్పడానికి అనేక రికార్డులు ఉన్నాయి. కానీ, కొందరు నాయకులు మాత్రం.. ఎలాంటి ఆధారం లేకుండా ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు. అయితే వాస్తవాలను మాత్రం ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఓటమి భయం ముందుగానే పట్టుకొన్న కొంత మంది పని గట్టుకొని భానుప్రసాద్రావును టార్గెట్ చేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఖండిస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీ రికార్డులను పరిశీలించుకోవచ్చని సవాల్ విసురుతున్నారు.