మొక్కలు నాటి కంటికిరెప్పలా కాపాడుతున్న జవహర్ నవోదయ విద్యాలయం విశ్రాంత ఉద్యోగి
ఆదర్శం గట్టు కృష్ణమూర్తి
చొప్పదండి, డిసెంబర్ 7: హరితహారంలో భాగంగా తన వార్డులో 50కి పైగా మొక్కలు నాటి, కంటికి రెప్పలా కాపాడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయం రిటైర్డ్ జేఎస్ఏ గట్టు కృష్ణమూర్తి. వివరాల్లోకి వెళ్తే.. మంథనికి చెందిన కృష్ణమూర్తి చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహించినప్పుడు హరితహారం మొదటి విడుతలో తన స్వగ్రామంలో 50కి పైగా మొక్కలు నాటారు. వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేసి, సంరక్షించగా ఏపుగా పెరిగాయి. గతేడాది ఉద్యోగ విరమణ పొందగా, అప్పటి నుంచి చొప్పదండి ఒకటో వార్డు పరిధిలోని విజయనగరం కాలనీలో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా వార్డులో రోడ్ల పక్కన పూలు, నీడనిచ్చే 50 మొక్కలు నాటారు. వాటికి ట్రీగార్డులతో పాటు నంబర్లు కేటాయిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. వారానికోసారి కలుపు తీస్తూ, ఎరువులు వేస్తున్నారు.
సంతోషంగా ఉంది
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొక్కల పెంపకంపై దృష్టిసారించా. మా స్వగ్రామంలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగినయి. వాటిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. చొప్పదండి ఒకటో వార్డులో మున్సిపల్ పాలకవర్గం, కాలనీ ప్రజల సహకారంతో 50 మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేసిన. హరితహారంలో భాగస్వామినై భావితరాలకు హరిత సంపదను ఇవ్వడం సంతోషంగా ఉంది.