పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
గంగాధర మండలం బూరుగుపల్లిలో పంట క్షేత్రాల సందర్శన
గంగాధర, డిసెంబర్ 7 : యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగుపై రైతులు దృష్టిని సారించాలని, ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు పంట మార్పిడి విధానంపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మండలంలోని బూరుగుపల్లిలో సాగి రాజేశ్వర్రావుకు చెందిన భూమిలో కౌలు రైతు పలుమారి సత్తయ్య సాగు చేసిన టమాటతో పాటు ఆయన సొంత భూమిలో పండించిన అల్లం పంట, బూరుగుపల్లికి చెందిన సాగి అజయ్రావు సాగు చేసిన మినుము పంటలను మంగళవారం పరిశీలించారు. వరికి బదులు కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేస్తున్న సత్తయ్య, అజయ్రావును కలెక్టర్ అభినందించారు. టమాట ఎన్ని ఎకరాల్లో సాగు చేశావు?, దిగుబడి ఎంత వస్తుంది?, ఆదాయం ఎలా ఉందని సత్తయ్యను కలెక్టర్ అడిగారు. రెండెకరాల్లో టమాట పంటను సాగు చేయగా ఖర్చులు పోనూ రెండున్నర లక్షలు మిగిలినట్లు సత్తయ్య కలెక్టర్కు వివరించారు. అల్లం ప్రస్తుతం పిలకదశలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనుగోలు చేయదని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయదని కలెక్టర్ చెప్పారు. వరి సాగు చేసే రైతులు ముందుగా మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రైతులు కూరగాయలు, నూనె గింజలు, పప్పు దినుసులు పండించి ఆర్థికాభివృద్ధిని సాధించాలని సూచించారు.
వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలి
గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గంగాధర పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీ పరిధిలో గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ వివరాలు ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడి, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్పై ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. గర్భిణులకు కూడా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. పీహెచ్సీలో సౌకర్యాలు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమాల్లా జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, సర్పంచ్ సాగి రమ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో జనార్దన్ రెడ్డి, ఏవో రాజు, ఏపీవో చంద్రశేఖర్, ఏఈవో వెంకట్, పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ ఉష, డాక్టర్ సురేశ్, ఆరోగ్య సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.