అన్నదాతను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించడమే లక్ష్యం
ఎంఐహెచ్డీ కింద పండ్లతోటల పెంపకానికి భారీ రాయితీలు
కూరగాయల సాగుకు సబ్సిడీపై నారు
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 7: దొడ్డు వరి సాగు చేస్తూ అష్టకష్టాలు పడుతున్న రైతాంగాన్ని పంటమార్పిడి వైపు మళ్లించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఉద్యానవన శాఖ ద్వారా పండ్లతోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని సంకల్పించింది. అర్హులైన రైతులకు సబ్సిడీపై విత్తనాలు, నారు మొలకలు అందించాలని నిర్ణయించింది. వినూత్న పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ అండగా నిలుస్తున్న సర్కారుకు కర్షకలోకం కృతజ్ఞతలు తెలుపుతున్నది
రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా మరో ముందడుగు వేసింది. వరికి ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల పెంపకంపై అన్నదాతలను జాగృతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రీయ ఉద్యానవన మిషన్ పథకం కింద అరటి, జామ, బొప్పాయి, మామిడి తోటల పెంపకంపై వ్యవసాయాధికారులు రైతు వేదికల్లో క్లస్టర్లవారీగా సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయల సాగుకు నారు మొలకలను సైతం అందించనున్నారు. ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వం సూచించిన కంపెనీల నుంచి విత్తనాలు, నారు తెచ్చుకొని సాగుచేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యానవన పంటలకు ఇస్తున్న రాయితీ సాగు విధానాలు ఇలా ఉన్నాయి..
అరటి తోటల పెంపకం..
అరటి తోటలు సాగు చేయాలనుకునే రైతులు హెక్టారుకు (2.20 ఎకరాలు) 3,086 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క 1.8 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పుతో ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వం తరుఫున సాగుచేసిన రైతుకు హెక్టారుకు రూ. 30,799ల రాయితీ ఇస్తున్నది.
జామతోటలకు..
జామతోటలు సాగు చేయాలనుకునే రైతులు హెక్టారుకు 1,111 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క మధ్య 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో ఉండేలా నాటుకోవాలి. ప్రభుత్వం తరపున సబ్సిడీపై సాగు చేసిన రైతులకు రూ.17,600లను రాయితీగా ఇస్తుంది.
బొప్పాయి తోటలకు..
బొప్పాయి తోటలు సాగు చేయాలనుకునే రైతులు హెక్టారుకు 3,086 మొక్కలు నాటాలి. మొక్కల మధ్య 1.8 మీటర్లు పొడవు, 1.8 మీటర్లు వెడల్పు ఉండేలా చూసుకోవాలి. ఈ తోటలు సాగు చేసే రైతులకు హెక్టారుకు రూ.22,500ల చొప్పున సబ్సిడీ అందనున్నది.
మామిడి తోటలకు..
మామిడి తోటలు సాగు చేయాలనుకునే రైతులు హెక్టారుకు 400 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క మధ్య 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండేలా చూసుకోవాలి. మామిడి తోటలు సాగుచేసుకునే రైతులకు ప్రభుత్వం రాయితీ కింద హెక్టారు(2.20 ఎకరాలు)కు రూ.9,840 ను అందిస్తున్నది.
కూరగాయల పెంపకానికి 90 శాతం సబ్సిడీ..
కూరగాయలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై నారు మొలకలు అందిస్తున్నది. రైతు వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించేలా చర్యలు చేపట్టింది. మిరప, వంకాయ, టమాట నారును సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నుంచి తెప్పించి ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
టమాట, వంకాయ నారు ఎకరానికి సరిపడా 8,000 మొక్కల నారుకోసం రూ.1,500లు, మిరప నారు మొలకలు ఎకరానికి 6,400 మొక్కల నారు కోసం రూ.1,280 జిల్లా ఉద్యానవనశాఖ అధికారి (డీహెచ్ఎస్వో) పెద్దపల్లి పేరిట చెల్లుబాటయ్యేలా డీడీ తీసి సంబంధిత కార్యాలయంలో అప్పగించాలి.
సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి..
ఉద్యానవన పంటలపై ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను ఆసక్తిగల రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఉద్యానవన పంటలకు ప్రాధాన్యమిస్తున్న దృష్ట్యా బొప్పాయి, అరటి, మామిడి, జామ తోటల పెంపకంపై దృష్టిపెట్టాలి. ఆయిల్ పామ్ పం టను వేస్తే లాభదాయకంగా ఉంటుంది. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధార్, బ్యాంకు అకౌంట్ పాస్బుక్, ఒక పాసుపోర్ట్ సైజు ఫొటోతో జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సంప్రదించాలి.
-జ్యోతి, డివిజన్ ఉద్యానవనశాఖాధికారి, పెద్దపల్లి