స్థలాన్ని పరిశీలించిన సీడీఎంఏ సత్యనారాయణ
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 7: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మోడ్రన్ స్లాటర్ హౌస్ (పశు వధశాల)ను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ సైంటిస్టుల బృందంతో కలిసి శనివారం స్థానిక రైతుబజార్లో స్థల పరిశీలన చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు సిరిసిల్లలో పోర్టబుల్ మీట్ ప్రొడక్షన్ అండ్ రిలేటింగ్ ఫెసిలిటీ(పీ-మార్ట్)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ వ్యర్థాల నిర్వహణకు రూ. 10లక్షలతో బయోగ్యాస్ ప్లాంట్ను నిర్మించనున్నామని పేర్కొన్నారు. త్వరలోనే నివేదికను సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ శ్రీధర్, ఎస్ శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య, టౌన్ప్లానింగ్ అధికారి అన్సర్, ఇంజినీర్ రఘు, తదితరులు ఉన్నారు.